కాంగ్రెస్ కార్యకర్తల ఆ కుటుంబానికి, బీజేపీలో మాత్రం అలాకాదు: మోడీ
న్యూఢిల్లీ: అవినీతి కారణంగా 2014లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత విపక్ష పాత్ర పోషించడంలోను దారుణంగా విఫలమైందని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు. ఆయన పలు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడారు.
మన పోలింగ్ బూత్ బలంగా ఉండటమే మనకు అసలైన బలమని చెప్పారు. పాత తరం కాంగ్రెస్ కార్యకర్తలు పడిన కష్టమంతా ఒకే ఒక్క కుటుంబం ఉపయోగించుకుందన్నారు పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్త పార్టీ శిఖరాగ్రాన ఉండి నేతృత్వం వహించే అవకాశం ఒక్క బీజేపీలోనే దక్కుతుందని తెలిపారు.
గత నాలుగేళ్ల బీజేపీ పాలనలో దేశం ప్రగతిపథంలో పయనిస్తోందని మోడీ అన్నారు. ఇదే విషయాన్ని యావత్ ప్రపంచం, ప్రముఖ సంస్థలు సైతం చెప్పాయని తెలిపారు. నాలుగేళ్ల క్రితం ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పదవ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నామన్నారు.