జపాన్కు మోడీ పయనం, షింజో అబే అంత్యక్రియలకు హాజరు
ప్రధాని మోడీ జపాన్ బయల్దేరి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఆయన టోక్యోకు పయనం అయ్యారు. ఇటీవల హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు రేపు టోక్యోలో నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే షింజో అంబే అంత్యక్రియలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారు.
దీనికి సంబంధించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు హాజరవుతానని, షింజో అబే తనకు అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. భారత్-జపాన్ మైత్రికి సంబంధించి గొప్పగా కృషి చేశారని మోడీ అభివర్ణించారు. షింజో అబే వంటి మహోన్నత నేతను కోల్పోయినందుకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, అబే అర్ధాంగికి భారతీయులందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని వివరించారు.
షింజో అబే ఆశయాలను కొనసాగిస్తూ భారత్, జపాన్ సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. జపాన్ పర్యటన సందర్భంగా మోడీ.... జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో స్వల్పకాలిక భేటీలో పాల్గొంటారని తెలుస్తోంది. జులై 8న ఎన్నికల ప్రచారం సందర్భంగా షింజో అబే ఓ మాజీ సైనికుడి చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.