అవినీతి అడ్డా కాంగ్రెస్..! పేదల సంక్షేమం మాతోనే.. ప్రచారంలో మోడీ
రాయ్గఢ్ : బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వార్ మరింత ముదిరింది. రాఫేల్ వివాదంలో బీజేపీని ఇరుకున పెట్టాలనుకుంటోంది కాంగ్రెస్. అదేస్థాయిలో హస్తం గూటిపై ఆరోపణలు గుప్పిస్తోంది బీజేపీ. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్గఢ్ లోని రాయ్గఢ్ బహిరంగ సభలో పాల్గొన్న మోడీ.. కాంగ్రెస్ పార్టీపై ఓ రేంజ్లో ఆరోపణాస్త్రాలు సంధించారు. అవినీతి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా అంటూ మండిపడ్డారు.
అవినీతికి కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్..!
అవినీతి తప్ప మరొకటి తెలియని కాంగ్రెస్ పార్టీ.. బీజేపీపై ఆరోపణలు చేయడం తగదన్నారు మోడీ. అవినీతిని పెంచి పోషించే కాంగ్రెస్.. అక్రమాలకు పాల్పడ్డవారికి సాయమందిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ అభివృద్ధి చేస్తోంటే అడ్డుకోవాలని చూడటమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారం చేపట్టాక అనైతిక పోకడలకు పోతోందని విరుచుకుపడ్డారు. సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమని చెబుతుండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రజోపయోగమైన కొన్ని పథకాలను వద్దని చెబుతుండటం చూస్తుంటే.. ప్రజలకు మంచి చేసే ఉద్దేశం వారికి లేనట్లే కదా అని వ్యాఖ్యానించారు.
ఏళ్లకొద్దీ పాలించి నాశనం చేశారు..!
55 ఏళ్ల మీ పాలనలో ఒరిగిందేమిటి అంటూ కాంగ్రెస్ నేతలకు ప్రశ్నలు సంధించారు మోడీ. ఏళ్లకొద్దీ పాలించి దేశాన్ని నాశనం చేశారంటూ ధ్వజమెత్తారు. బీజేపీ మాత్రం పేద ప్రజల సంక్షేమమే ఎజెండాగా ముందుకెళుతోందని చెప్పుకొచ్చారు. మోడీకి పేదప్రజలు అండగా ఉంటున్నారనే విషయం తెలిసి కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. పేదరిక నిర్మూలనకు కృషి చేశామని, ప్రజలు వారంతట వారే పోరాడి సాధికారత సాధించేలా చేశామన్నారు. ఛత్తీస్గఢ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
వాళ్లకు మోడీ జపంతోనే సరిపోతోంది..!
కాంగ్రెస్ నేతలకు నా జపం చేయడమే తప్ప ఇంకో పని లేనట్టుందన్నారు మోడీ. రానున్న లోక్సభ ఎన్నికల్లో అవినీతీ పార్టీలన్నీ ఏకమై బీజేపీని ఓడించాలని కలగంటున్నాయి. కానీ అది కుదరని పనని చెప్పుకొచ్చారు. ఈ చౌకీదార్ మీ కోసమే పనిచేస్తాడంటూ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అవినీతి గొడుగు కింద ఏకమైన పార్టీలను తరిమికొట్టాలని, సమర్థవంతమైన బీజేపీని మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. బడ్జెట్ లో పేదలు, రైతుల కోసం పలు పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు.