7రాత్రులపాటు అక్కడే ఉండండి: ఎంపీలకు మోడీ
న్యూఢిల్లీ: పార్లమెంటేరియన్లు(పార్లమెంటుసభ్యులు) తమ తమ నియోజకవర్గాల్లో కనీసం వారం రోజుల పాటు గడపాలని.. అక్కడి సమస్యలు తెలుసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నేతలకు సూచించారు.
ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా భాజపా నేతలతో మోడీ సమావేశమయ్యారు. వారికి పలు విషయాలపై మోడీ మార్గదర్శకాలు సూచించినట్లు సమాచారం.
అలాగే ఏడు రోజుల పాటు తమ తమ నియోజకవర్గాల్లో ఉండి రాత్రి కూడా అక్కడే బస చేసి సమస్యలను తెలుసుకోవాలని, ప్రజలకు మరింత దగ్గరవ్వాలని మోదీ ఎంపీలను ప్రధాని మోడీ ఆదేశించారు.
బిజెపి ఎంపీలు నియోజకవర్గాల్లో ప్రజలతో చర్చించాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల గురించి ప్రచారం చేయాలని మోడీ సూచించారు. అలాగే ప్రజల స్పందన, వారు ఏం కోరుకుంటున్నారో జాబితా తయారుచేసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనలను తిరిగి ప్రధాని మోడీకి తెలియజేయాలని సూచించినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి.
కాగా, మే 26వ తేదీకి ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. మంత్రులు దేశ వ్యాప్తంగా 200 ప్రదేశాలు సందర్శించి తమ తమ విభాగాలు సాధించిన విజయాలు, ప్రజల ఫిర్యాదుల గురించి తెలుసుకోనున్నారని మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు.