ఉద్రిక్తత: శశికళ అరెస్ట్ కోసం భారీగా పోలీసులు: పన్నీరు వైపు రిసార్ట్స్ ఎమ్మెల్యేల చూపు!
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను దోషిగా ప్రకటిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు నిమిషాల్లోనే 35 వాహనాల్లో ఎస్పీ, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు.
న్యూఢిల్లీ/చెన్నై: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను దోషిగా ప్రకటిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు నిమిషాల్లోనే 35 వాహనాల్లో ఎస్పీ, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు, గోల్డెన్ బే రిసార్టును చుట్టుముట్టారు. రిసార్ట్స్ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. రిసార్టు బయటి గేటు తాళాలను పగలగొట్టి లోపలికి వెళ్లారు.
ఇప్పటికి ఇంకా శశికళ వద్దకు పోలీసులు వెళ్లనప్పటికీ.. ఆమె తనంతట తానుగా వచ్చి లొంగిపోయేందుకు కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. శశికళ లొంగిపోయేందుకు నాలుగు వారాల సమయం ఉన్నప్పటికీ.. మరింత కాలం ఆమె బయటే ఉంటే.. రాజకీయ అనిశ్చితి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో నిరసనలు జరగవచ్చని భావిస్తూ.. ముందే ఆమెను జైలుకు తరలిస్తే, సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను సాధారణ స్థాయికి తేవచ్చని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రిసార్ట్స్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
అయితే, శశికళ అరెస్టుకు ముందే నేరుగా బెంగళూరు వెళ్లి పోలీసులకు లొంగిపోయే అవకాశం కూడా ఉంది. కాగా, రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తరలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఓ ఖాళీ బస్సును కూడా పోలీసులు తీసుకొచ్చారు.
కోర్టు తీర్పు: పన్నీరు వైపు రిసార్ట్ ఎమ్మెల్యేల చూపు
సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ ఇక నేరుగా జైలుకే వెళ్లనుండటంతో... ఆమె వర్గంలో నైరాశ్యం నెలకొంది. రిసార్ట్లో ఉన్న శశికళ మద్దతుదారులైన ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది. తీర్పు వెలువడిన వెంటనే వారు పన్నీరు వైపు మారినట్లు సమాచారం. ఇక పన్నీరుకు జై కొట్టడమే మేలనే ఆలోచనలో వారు ఉన్నారు. ఇన్ని రోజులు తమను బలవంతంగా రిసార్టులో ఉంచారని, తాము పన్నీర్ కే మద్దతు ప్రకటిస్తామని వారు మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
శశి వర్గం నుంచి మరో వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజలు వారికి మద్దతు ప్రకటించే అవకాశం ఎంత మాత్రం లేదు. ఈ నేపథ్యంలో, తమ రాజకీయ భవిష్యత్తు రీత్యా ఆలోచించినా... పన్నీర్ చెంతకు చేరితే, ప్రజలు మద్దతును పొందవచ్చనే ఆలోచనలో శశి వర్గీయులు ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు రిసార్ట్ వద్దకు భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎమ్మెల్యేలను బయటకు తీసుకురావడానికి అనుగుణంగా బలగాలు మోహరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications