ఇది ఇల్లా ? తుపాకుల ఫ్యాక్టరీనా
కోల్ కతా: కోల్ కతా నగరంలోని ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 101 దేశీ, విదేశీ తుపాకులు, 50 రౌండ్ల బుల్లెట్లు, 9 కేజీలకు పైగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో కలకలం చెలరేగింది. దర్యాప్తు అధికారి సునీల్ చౌదరి కథనం ప్రకారం కోల్ కతా నగరంలోని రవీంద్రనగర్ లో ఆఫ్తాబ్ హుస్సేన్ నివాసం ఉంటున్నాడు. ఇతను అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్నాడని ఓ ఇన్ఫార్మర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు అతని ఇంటిపై దాడి చెయ్యడంతో భారీ సంఖ్యలో తుపాకులు దర్శనం ఇచ్చాయి. తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 101 తుపాకుల్లో 95 పైప్ గన్స్, రెండు 9ఎంఎం పిస్టళ్లు, నాలుగు సింగిల్ బారెల్ గన్స్ ఉన్నాయని సునీల్ చౌదరి చెప్పారు.
ఆఫ్తాబ్ హుస్సేన్ తో పాటు అతనికి సహకరిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఇద్దరు తుపాకులు తయారు చేసే కూలీలు ఉన్నారని సునీల్ చౌదరి అన్నారు. ఈ ముఠాకు అంతర్జాతీయ అక్రమ ఆయుధాల ముఠాతో సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.
ఆఫ్తాబ్ హుస్సేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇదే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నాడని వెలుగు చూసింది.
ఆఫ్తాబ్ హుస్సేన్ ఇంటిలో ఇద్దరు తుపాకులు తయారు చెయ్యడంతో ఆ ఇల్లు తుపాకులు తయారు చేసే ఫ్యాక్టరీ అయ్యిందని సునీల్ చౌదరి అన్నారు. ఎంత కాలం నుంచి వీరు తుపాకులు తయారు చేస్తున్నారు ? ఎవరెవరికి విక్రయించారు అని వివరాలు సేకరిస్తున్నామని సునీల్ చౌదరి చెప్పారు.