ఎడతెగని ఉత్కంఠ: ఎవరి బలమెంత, సిఎం కుర్చీ ఎవరిది?
సుప్రీంకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి పీఠానికి శశికళ దూరమైనా తమిళనాడులో ఉత్కంఠకు తెరపడలేదు. కుర్చీలాట సాగుతూనే ఉంది.
చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి పీఠానికి శశికళ దూరమైనా అధికారం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠకు మాత్రం తెర పడలేదు. అనూహ్యంగా అన్నాడియంకెలో పన్నీరు సెల్వంకు బద్ద వ్యతిరేకి అయిన పళనిస్వామి పేరు శశికళ స్థానంలో ముందుకు వచ్చింది. దాంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు ఎవరికి అవకాశం ఇస్తారనే సస్పెన్స్ కూడా వీడడం లేదు. తమిళనాడు శాసనసభ మొత్తం సీట్ల సంఖ్య 235. మొత్తం సభ్యుల్లో ఒకరు నామినేటెడ్ ఎమ్యెల్యే. 234 మంది ప్రజల ద్వారా ఎన్నికైనవారు. జయలలిత మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది.
ప్రస్తుతం శాసనసభలో 234 మంది సభ్యులున్నారు. వారిలో అధికార అన్నాడియంకె సభ్యుల సంఖ్య 135. ప్రధాన ప్రతిపక్షం డిఎంకెకు 89 మంది సభ్యులున్నారు. ఆ పార్టీ మిత్రపక్షమైన కాంగ్రెుకు 8 మంది సభ్యుల బలం ఉంది. ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఎమ్మెల్యే ఒకరు.
అసెంబ్లీలో మెజారిటీ నిరూపణకు 117 మంది సభ్యుల మద్దతు అవసరం. అన్నాడియంకెకు ఉన్న 135 మంది సభ్యుల్లో ఎవరు పన్నీరు సెల్వంకు మద్దతుగా నిలుస్తారు, ఎంత మంది పళనిస్వామి వెంట ఉంటారనేది ప్రశ్న. అయితే, పన్నీరు సెల్వం వెంట పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు కూడా లేరని అంటున్నారు.
శశికళకు ముఖ్యమంత్రి పీఠం దూరమైతే ఎమ్మెల్యేలు ఎక్కువ మంది పన్నీరు సెల్వం వైపు వస్తారనే అంచనా ఇంతకు ముందు ఉంది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పది మంది పన్నీరు వెంట ఉంటే 125 మంది సభ్యులు పళనిస్వామికి మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. వారిలో ఎవరైనా జారుకుంటారా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.
అన్నాడియంకె తమ ప్రత్యర్థి పార్టీ అని, తాము ఎవరికి కూడా మద్దతు ఇవ్వబోమని డిఎంకె శాసనసభా పక్ష నేత స్టాలిన్ ఇప్పటికే తేల్చేశారు. కాంగ్రెసు పార్టీ కూడా అదే వైఖరిని అవలంబిస్తోంది. ఈ పరిస్థితిలో సంక్షోభానికి తెరపడని చిత్రమే ఉంది.
ఈ స్థితిలో పళనిస్వామి వెంట కనీసం 117 మంది సభ్యులు నిలుస్తారా అనేది ప్రశ్న. ఎమ్మెల్యేలంతా తన వైపు వస్తారనే పన్నీరు సెల్వం మాట ఎంత వరకు నిజమవుతుందనేది మరో ప్రశ్న. గవర్నర్ ఎవరికి తొలుత అవకాశం ఇస్తారు, అసలుకు ఆయన ఏం చేస్తారనేది ఇంకా తేలాల్సే ఉంది.