ఉగ్రదాడులు: మతకల్లోలం సృష్టించేందుకు జైషే మహ్మద్ ప్లాన్: నిఘావర్గాలు
న్యూఢిల్లీ:అయోధ్య తీర్పు నేపథ్యంలో గత పది రోజులుగా కేంద్ర నిఘా వర్గాలు ఆయా రాష్ట్రాలను హెచ్చరించాయి. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అలర్ట్గా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది . అయితే తాజాగా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ భారత్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తోందన్న సమాచారం ఉందని మరోసారి అలర్ట్ జారీ చేశాయి దేశంలోని పలు నిఘా సంస్థలు.

దాడులకు జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ప్లాన్
మిలటరీ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరోలు దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ వరుస హెచ్చరికలు జారీ చేశాయి. అంతేకాదు ఈ దాడులు చాలా తీవ్ర స్థాయిలో ఉండనున్నాయని వెల్లడించింది. ఇక హెచ్చరికలు జారీ చేసిన అన్ని నిఘా వర్గాలు దాడుల తీవ్రతపై ఒకే మాటను వెలిబుచ్చాయి. భారత్లో దాడులు చేసేందుకు జైషే మహ్మద్ ప్లాన్ చేసిందని వారి కమ్యూనికేషన్కు సంబంధించిన కోడ్లను డీకోడ్ చేయగా తెలిసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలో మతకల్లోలాలకు ప్లాన్
అయోధ్యపై తీర్పు వచ్చినందున జైషే మహ్మద్ సంస్థ ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశం ఉందని నిఘావర్గాలు చెబుతున్నాయి. దాడులు నిర్వహించి దేశంలో మతకల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇక వారి కమ్యూనికేషన్స్ను పరిశీలించిన నిఘావర్గాలు ఇతర సెక్యూరిటీ సంస్థలతో కూడా మరోసారి క్రాస్ చెక్ చేసుకుంది. అయితే ఆ సంస్థలు కూడా దాడులు జరుగుతాయని ధృవీకరించడంతో హెచ్చరికలు జారీ చేశాయి.

గత పది రోజులుగా హెచ్చరిస్తున్న నిఘా వర్గాలు
దేశరాజధాని న్యూఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆగష్టు 5 నుంచే నిఘావర్గాలు ఆయా రాష్ట్రాలను హెచ్చరిస్తూ వస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటన చేసినప్పటి నుంచే నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications