ప్రత్యూష కేసులో షాకింగ్ మలుపు: హత్య కేసు అయ్యే ఛాన్స్
ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో తాజాగా కొత్త ట్విస్ట్! ప్రత్యూషది నూటికి నూరుపాళ్లు హత్యేనని, ఈ కేసులో రాహుల్ రాజ్ సింగ్ను తీవ్రంగా శిక్షించాలని ప్రత్యూష తల్లి గురువారం నాడు డిమాండ్ చేసింది.
ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పినట్లు రాహుల్ రాజ్ సిగ్ పైన కేసు నమోదైన విషయం తెలిసిందే. రాహుల్ గతంలో కూడా పలువురు మహిళలను మోసం చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేశాడని ఆరోపిస్తున్నారు.
రాహుల్ వలలో చిక్కుకున్న వారు డజను వరకు యువతులు ఉంటారని అంటున్నారు. మరోవైపు, ప్రత్యూషతో సహజీవనం చేస్తున్న రాహుల్ పైన ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ కుమార్తెను పథకం ప్రకారం హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాహుల్ రాజ్ సింగ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ న్యాయస్ధానం ముందుకు విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా ఇది ఆత్మహత్య కాదని, హత్య కేసు అయ్యే అవకాశం ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని ప్రత్యూష కుటుంబం తరపు లాయర్... న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో రాహుల్ బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి కొట్టివేశారు.