ప్రియాంక గాంధీ ఢిల్లీలో జీన్స్, నియోజకవర్గంలో చీర ధరిస్తారు: బీజేపీ ఎంపీ
ఢిల్లీ: యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూతురు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఢిల్లీలో ఓ రకమైన దుస్తులు, యూపీలోని గ్రామీణ ప్రాంతాల్లో మరో రకమైన దుస్తులు ధరిస్తారని భారతీయ జనతా పార్టీ ఎంపీ హరీష్ ద్వివేది అన్నారు.
ప్రియాంక గాంధీ ఢిల్లీలో ఉంటే జీన్స్, టీషర్ట్ ధరిస్తారని, యూపీలోని నియోజకవర్గంలో పర్యటించే సమయంలో మాత్రం చీర ధరిస్తారని, నుదుట సింధూరం పెట్టుకుంటారని, ఇది అందరికీ తెలిసిందేనని చెప్పారు. రాహుల్ గాంధీ ఓడిపోయినట్లే ప్రియాంక కూడా ఓడిపోతారని జోస్యం చెప్పారు.
ప్రియాంక గాంధీ పూర్తిస్థాయి రాజకీయ రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్ టార్గెట్గా ప్రియాంక గాంధీకి ఈస్ట్ యూపీ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా వ్యూహాత్మకంగా ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా బీజేపీ ఎంపీ మాట్లాడారు.
గతంలో ప్రియంకా గాంధీ రాజకీయ ప్రవేశం గురించి బీహార్ మంత్రి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ఆమె చాలా అందంగా ఉంటారని, అంతకు మించి ఆమెకు ఎలాంటి రాజకీయ అనుభవం, నైపుణ్యం లేదని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత ఖైలాశ్ విజయ్వర్గియా మాట్లాడుతూ.. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు లేకపోవడంతోనే చాక్లెట్ ముఖాలను బరిలోకి దించుతున్నారని ఎద్దేవా చేశారు.