ఐఏఎస్ అధికారి రవి మాఫియా విరోధి: కోలారు టైగర్ (పిక్చర్స్)
బెంగళూరు: ఐఏఎస్ అధికారి రవి మరణానికి కారణం అయిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేసినప్పుడు రవిని కావాలని బదిలి చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణల ఉన్నాయి. కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేసే సమయంలో రవి ఇసుక మాఫియాకు కళ్లెం వేశారు. కోలారు నుండి బెంగళూరు తరలిస్తున్న ఇసుక లారీలను ఎక్కడికక్కడ సీజ్ చేశారు.
కోలారు జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, శాసన సభ్యుల కంటే పేదలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. రవి పని తీరు చాల వేగంగా ఉండేది. ఆయనతో పాటు సాటి ఉద్యోగులు పని చెయ్యలేకపోయేవారు. పేదలకు సేవ చెయ్యడంతో పాటు రవి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కోలారు పట్టణం మొత్తం పాదయాత్ర చేస్తూ స్వచ్చ భారత్ కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా ఆయనే చీపురు పట్టుకుని రోడ్లు ఊడ్చారు.
కోలారు టైగర్ అని పేరు తెచ్చుకుని ఐఏఎస్ అధికారులలో గుర్తింపు తెచ్చుకున్న రవి మరణం తమ జిల్లాకు తీరని లోటు అని కోలారు ప్రజలు అంటున్నారు. రవి ఉద్యోగంతో పాటు సమయం చిక్కినప్పుడు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.
నిస్పక్షపాతంగా దర్యాప్తు...... న్యాయం చేస్తాం..... సిద్దు
విక్టోరియా ఆసుపత్రిలో ఐఏఎస్ అధికారి రవికి నివాళులు అర్పించిన తరువాత సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిపించి రవి కుటుంబానికి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు.
36 ఏళ్లకే 100 సంవత్సరాలు నిండిపోయాయి
కుణిగల్ తాలుకా హులియూరు దుర్గ, దోడ్డకొప్పలు గ్రామంలో 10.06.1979లో రవి జన్మించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ, బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ పూర్తి చేశారు.
పేదలంటే ప్రాణం...........!
2009లో ఐఏఎస్ అధికారి అయిన తరువాత రవి గుల్బర్గాలో మొదటి సారి విధులు చేపట్టారు. తరువాత కోప్పళ జిల్లా పంచాయితీ సీఇఓగా, కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేశారు.
ప్రజల గుండెలలో పదిలంమైన స్థానం
14 నెలల కాలంలో రవి కోలారు జిల్లా ప్రజల గుండెలలో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. రవి తన భార్య కుసుమతో కలిసి దళితుల ఇండ్లకు వెళ్లి వారు చేసే భోజనం తిన్నారు. దళితులకు అన్యాయం చేసిన వారిని హెచ్చరించారు.
విద్యార్థులకు మెళుకవలు.............!
కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ఐఏఎస్, ఐపీఎస్ పరిక్షలు ఎలా రాయాలని శిక్షణ ఇచ్చి మెళుకవలు నేర్పించారు. పలువురు విద్యార్థులను ఆర్థికంగా ఆదుకున్నారు.
మాఫియా విరోధి...........!
ఐఏఎస్ రవి కోలారు జిల్లాలో భూ మాఫియా, ఇసుక మాఫియా మీద డేగ కన్ను వేశారు. ఈ విషయం జీర్ణించుకొలేని వారు రవిని ఆ జిల్లా నుండి వాణిజ్య పన్నుల శాఖకు బదిలీ చేయించారు.
ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి..........!
కోలారు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన రవి అక్కడి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. మద్యాహ్నం భోజనం తిని నాణ్యతను పరిశీలించారు.
ఎట్టి పరిస్థితిలో వదిలి పెట్టం...........!.
ఐఏఎస్ అధికారి రవి ఆత్మహత్య చేసుకున్నారా, హత్యకు గురైనారా అనే విషయం దర్యాప్తులో వెలుగు చూస్తుందని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ తెలిపారు. తప్పు చేసిన వారిని చట్టం వదలి పెట్టదని ఆయన గుర్తు చేశారు.