ఉద్యోగం కావాలంటే గుట్కా, సిగరేట్ మానాల్సిందే
రాష్ట్రంలో ఎక్కువమంది యువకులు ఈ దురలవాట్లతో క్యాన్సర్ బారినపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 4న జారీ చేసిన ఈ సర్క్యూలర్ కాపీని రాష్ట్ర గవర్నర్, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెక్రటరీ, రాజస్థాన్ విధాన్ సభ, రిజిస్ట్రార్, రాజస్థాన్ హైకోర్టు (జైపూర్/జోధ్పూర్)లకు పంపింది. 2012 నవంబర్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి టొబాకో నియంత్రణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగాల కోసమైనా తమ చెడు అలవాటైన గుట్కా, ధూమపానం సేవించడాన్ని యువకులు వదలుకుంటారనేది ప్రభుత్వ ఉద్దేశం. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుదర్శన్ సేథి మాట్లాడుతూ.. గుట్కా నమలడం, ధూమపానం చేయడం వల్ల యువత అనారోగ్యం బారినపడుతున్నారని, వారిని ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అలవాట్లకు దూరంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.
టొబాకో నియంత్రణ విభాగం రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ సునీల్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే గుట్కా, ధూమపానాన్ని నియంత్రించేందుకు ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి నిర్ణయాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. 2012 నవంబర్లో సమావేశమైన కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని, నిబంధనలకు విరుద్ధంగా గుట్కా, ధూమపానం చేస్తున్న వారిపై తదుపరి సమావేశంలో జరిమానా విధించే యోచనపై చర్చించనున్నట్లు తెలిపారు.