కాల్చింది నేనే.. : రాఖీతొ నిజం కక్కించారు
పాట్నా : రాఖీ యాదవ్ నిజం ఒప్పేసుకున్నాడు. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న కారణంతో సచ్ దేవ్ అనే విద్యార్థిని నడిరోడ్డుపైనే కాల్చి చంపిన ఘటనలో, నేరం తనది కాదని బుకాయిస్తూ వస్తున్న రాఖీ యాదవ్ తాజాగా నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం.
కొద్దిరోజుల క్రితం బీహార్ లో.. తన కారును దాటేసి వెళ్తున్నాడన్న కారణంతో సచ్ దేవ్ అనే విద్యార్థిపై కాల్పులకు తెగబడ్డాడు రాఖీ. దీంతో సచ్ దేవ్ అక్కడిక్కడే చనిపోయాడు. రాఖీ స్థానిక ఎమ్మెల్సీ మనోరమాదేవి కుమారుడు కావడంతో తదుపరి చర్యల పట్ల అనుమానాలు వ్యక్తమైనా..! పోలీసులు రాఖీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలోనే.. రాఖీ నేరాన్ని ఒప్పుకున్నట్టుగా బీహార్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఘటన స్థలంలో లభించిన పిస్తోల్ కూడా రాఖీ పేరు మీదనే ఉన్నట్టుగా తెలిపారు. ఇదిలా ఉంటే, రాఖీ చేసిన నేరానికి ఎమ్మెల్సీ మనోరమాదేవిపై జేడియూ అధిష్టానం వేటు వేసిన విషయం తెలిసిందే.