ఎర్రచందనం స్మగ్లింగ్: మాజీ మంత్రికి నోటీసులు, నటులు ఉన్నారా?
హైదరాబాద్/కోల్కతా: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలకమైన వ్యక్తులను అరెస్టు చేసే దిశలో అడుగులు వేస్తున్నారు. వారు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతకు ఒకరికి సమన్లు జారీ చేసే అవకాశాలున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎర్ర చందనం దొంగలకు తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఏపీకి చెందిన ఎమ్మెల్యేల సహకారం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎర్ర చందనం పెద్ద దొంగలను పోలీసులు ప్రశ్నించవచ్చునని తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో ఎర్ర చందనం స్మగ్లర్లు పెట్టుబడులు పెట్టినట్లుగా కూడా చెబుతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్కు ఇటీవల పశ్చిమ బెంగాల్ లింక్స్ బయటపడ్డ విషయం కూడా తెలిసిందే. కాగా, కొందరు నటులు కూడా ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్లో ఉండి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.
సీతారాంపేటలో పదిలక్షల రూపాయల ఎర్రచందనం
శేషాచలం ఎన్కౌంటర్ నేపథ్యంలో ఎర్రచందనం దొంగలు భయపడుతున్నారు. పోలీసులకు పట్టుబడతామనే భయంతో ఎక్కడికి అక్కడే వాహనాలు వదిలి పారిపోతున్నారు. సీతారాంపేట వ్యవసాయ భూమిలో సుమో వాహనంలో పోలీసులు రూ.10 లక్షల ఎర్ర చందనం దుంగలను పట్టుకున్నారు.
ఏపీకి సౌందర్ రాజన్?
పశ్చిమ బెంగాల్లో పట్టుబడిన ఎర్రచందనం స్మగ్లర్ సౌందర్ రాజన్ను పిటీ వారెంటు పైన ఏపీకి తీసుకు వచ్చేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బెంగాల్లో స్వాధీనం చేసుకున్న దుంగలను మూడు ప్రత్యేక కంటెయినర్ల ద్వారా రాష్ట్రానికి తీసుకు వస్తున్నారు.
భూటాన్ సరిహద్దులోని సిలిగురి ప్రాంతంలో సౌందర్ రాజన్తో పాటు పట్టుబడ్డ దుంగలను ఏపీకి తరలించేందుకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. సౌందర్ రాజన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చెన్నై, కోల్కతా, బెంగళూరు తదితర ప్రాంతాల్లోని స్మగర్లను అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు.