మన వేళ్లతో మన కంటినే పొడిచారు: పార్టీ నేతలతో శశికళ ఉద్వేగం..
సుప్రీం తీర్పు నుంచి తేరుకున్న శశికళ అన్నాడీఎంకె నేతలతో ఉద్వేగ వ్యాఖ్యలు చేశారు. మన వేళ్లతో మన కంటినే పొడుస్తున్నారని శశికళ పార్టీ ఎమ్మెల్యేలతో ఆవేదన వ్యక్తం చేశారు.
చెన్నై: అంతా అనుకున్నట్టు జరిగుంటే.. అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఈపాటికి సీఎం కుర్చీలో కూర్చుండేవారు. పన్నీర్ తిరుగుబాటుతో పార్టీలో మొదలైన సంక్షోభం అంతకంతకూ పెరుగుతూ.. చివరికి శశికళను జైలుకు పంపించేదాకా వచ్చింది.
కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో ప్రస్తుతం తీవ్ర ఆవేదనలో ఉన్న శశికళ.. ధైర్యాన్ని కూడదీసుకుని తొలుత పార్టీ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు వారం రోజుల పాటు పార్టీలో తలెత్తిన సంక్షోభ స్థితిని పూర్తిగా సవరించిన తర్వాతే లొంగిపోవాలని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే నేపథ్యంలో అనారోగ్యాల కారణాలను ప్రస్తావిస్తూ లొంగిపోయేందుకు శశికళ నాలుగు వారాల గడువు కోరారు. అదే సమయంలో పార్టీ నేతలతోను శశికళ ఉద్వేగ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో సంక్షోభానికి ప్రధాన కారణం పన్నీర్ సెల్వమే అని పార్టీ నేతలతో శశికళ పేర్కొన్నారు.
మన వేళ్లతో మన కంటినే పొడుస్తున్నారని శశికళ పార్టీ ఎమ్మెల్యేలతో ఆవేదన వ్యక్తం చేశారు. పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక జయలలిత సమాధి వద్ద ఫోటో దిగి మనందరిది ఒకే కుటుంబమని ప్రపంచానికి చాటుదామని శశికళ పార్టీ నేతలతో పేర్కొన్నారు.
అన్నాడీఎంకె నేతలంతా ఓ కుటుంబంలా తనకు అండగా నిలబడితే తాను ఏదైనా సాధించగలనని శశికళ ధీమా వ్యక్తం చేశారు. అమ్మ జయలలిత ఆశీర్వాదాలు తనకు ఉన్నాయన్నారు. ప్రత్యర్థి పార్టీలు చేస్తోన్న కుట్రలకు సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.