నిద్రలేని రాత్రి గడిపిన శశికళ.. క్షణమొక యుగంలా రాత్రంతా బెంగతో!
అక్రమాస్తుల కేసులో నేటి ఉదయం సుప్రీం కీలక తీర్పు వెలువరిస్తానని ప్రకటించడంతో.. నిన్న రాత్రి నుంచి శశికళకు క్షణమొక యుగంలా గడుస్తూ వచ్చింది.
చెన్నై: ఓవైపు ఊరిస్తోన్న అధికార పీఠం.. మరోవైపు జైలు ఊచలు.. అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఆలోచనలు నిన్న రాత్రి నుంచి వీటి చుట్టే తిరిగాయి. అక్రమాస్తుల కేసులో నేటి ఉదయం తీర్పు వెలువరించిన సుప్రీం.. శశికళను దోషిగా ప్రకటించడంతో ప్రస్తుతం ఆమె ముందు గాఢాంధకారం అలుముకున్న పరిస్థితి.
ఎమ్మెల్యేలు పట్టు జారకుండా కాపాడుకోవడం.. సుప్రీం తీర్పు నేపథ్యంలో మున్ముందు ఎలా వ్యవహరించాలోనన్న సమాలోచనలతో గత రాత్రి ఆమెకు నిద్ర కూడా కరువైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందా? ప్రతికూలంగా వస్తుందా? అన్న ఆందోళన, ఒకలాంటి బెంగ ఆమెలో కనిపించినట్టు పార్టీ నేత ఒకరు వెల్లడించినట్టు తెలుస్తోంది.
సుప్రీం తీర్పు సానుకూలంగా వచ్చేలా పలువురు దేవతలను శశికళ వేడుకున్నట్టుగా చెబుతున్నారు. అలాగే ఒకవేళ తాను గనుక జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తితే పగ్గాలు మాత్రం పన్నీర్ చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఆమె రాత్రంతా వ్యూహాలు రచించినట్టు సమాచారం.
గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేలకు అస్వస్థత:
ఓవైపు సుప్రీం తీర్పు శశికళలో అంతకంతకు టెన్షన్ రేకెత్తిస్తుంటే మరోవైపు గోల్డెన్ బే రిసార్టులోని ఎమ్మెల్యేలు అస్వస్థతకు గురవడం ఆమెను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన వారం రోజులుగా రిసార్టు గదులకే పరిమితమవడం.. సమయానికి మందులు వేసుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడంతో వారందరు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.