సంతకాలతో శశికళ చక్రం తిప్పబోయారా! అమ్మ మృతికి కొద్దిగంటల ముందు..
జయ మరణానికి కొద్దిగంటల ముందు ఏ-4 సైజు పేపర్ మీద తనకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలతో శశికళ సంతకాలు సేకరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
చెన్నై: నాటకీయ పరిణామాల నడుమ జయలలిత మరణం.. ఆ వెనువెంటనే తమిళ రాజకీయ తెరపై ఆసక్తిర పరిణామాలు చోటు చేసుకుంటుండటం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జయ మరణం తర్వాత పన్నీర్ సెల్వంను ఆమె వారసుడిగా ప్రకటించినప్పటికీ.. జయ నెచ్చెలి శశికళ కూడా ఇందుకోసం తెర వెనుక ప్రయత్నాలు గట్టిగానే చేసినట్టుగా తెలుస్తోంది.
జయ చనిపోవడానికి కొద్ది గంటల ముందు అమ్మ చికిత్స పొందిన అపోలో కేంద్రంగానే పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా సమాచారం. జయలలిత స్థానంలో సీఎంగా ఎవరిని కూర్చోబెట్టాలన్న చర్చోపచర్చలు సాగిన తరుణంలో.. జయ నెచ్చెలి శశికళ చక్రం తిప్పడానికి ప్రయత్నించార్న వాదనలు వినిపిస్తున్నాయి.
పార్టీపై పట్టు బిగించడం కోసం మెజార్టీ ఎమ్మెల్యేలు తన వెనకే ఉన్నారని చెప్పడానికి తెరవెనుక శశికళ చాలానే ప్రయత్నించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఏ-4 సైజు పేపర్ మీద తనకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలతో సంతకాలు కూడా తీసుకున్నారట. ఈ విషయం పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వెల్లడించారన్న వార్తలు వస్తున్నాయి.
పార్టీలో విభేదాలు తలెత్తిన సందర్బంలో.. తనకు మద్దతు పలికే ఎమ్మెల్యేలతో కలిసి ఎదురు తిరగడానికే ఆమె సంతకాల సేకరణ చేపట్టారన్న చర్చ జరుగుతోంది. పరిణామాలెలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అంతర్గతంగానే ఉన్న ఆధిపత్య పోరు భవిష్యత్తులో బహిర్గతం అయ్యే సూచనలు లేకపోవు.