14 రాజకీయ పార్టీ ప్రతినిధులతో మోడీ మీట్.. కశ్మీర్లో సెక్యూరిటీ అలర్ట్
జమ్ము కశ్మీర్.. పైకి సుందరంగా కనిపిస్తోన్న టెన్షన్.. టెన్షన్. రాష్ట్రంగా ఉంటే భద్రత కల్పించలేమని భావించి మోడీ సర్కార్ కేంద్రపాలిత ప్రాంతం చేసింది. అప్పటినుంచి అక్కడ ఉగ్రవాద దాడులు తగ్గుముఖం పట్టాయి. నియంత్రణ రేఖ వెంబడి కూడా దాడులు పెద్దగా లేవు. ఈ క్రమంలో ఎల్లుండి (24వ తేదీన) ప్రధానమంత్రి మోడీ రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. దీంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
జమ్మూకశ్మీర్కు చెందిన 14 రాజకీయ పార్టీల తరఫున హాజరుకానున్న ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. కశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. భద్రతా బలగాలకు చెందిన ఉన్నతాధికారులు ఇవాళ శ్రీనగర్లో భేటీ అయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న భద్రతాపరమైన పరిస్థితులపై చర్చించారు. కొన్ని చోట్ల లోపాలు కనిపించాయని వాటిని వెంటనే కట్టుదిట్టం చేసేలా చర్యలు చేపట్టామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
వాస్తవానికి సమావేశం ఢిల్లీలో జరగనుంది. కానీ కశ్మీర్లో ఎలాంటి హింస జరగకుండా చూస్తున్నారు. ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా చూసేందుకు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని మరో అధికారి తెలిపారు. జమ్మూకశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగుతున్న కీలక రాజకీయ సమావేశం ఇదే కావడం విశేషం. మరోవైపు నియంత్రణా రేఖ వెంట సైతం బలగాలు అప్రమత్తం అయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రతికూల ఘటనలకు అవకాశం ఇవ్వొద్దని నిర్ణయించుకున్నామని అధికారులు తెలిపారు.