పూలన్ దేవి హత్య కేసులో నిందితుడు షేర్ సింగ్ రాణా వివాహం
న్యూఢిల్లీ: బందిపోటు రాణిగా ప్రఖ్యాతి గాంచిన సమాజ్వాదీ పార్టీ మాజీ ఎంపీ పూలన్ దేవి హత్య కేసులో నిందితుడుగా ఉన్న షేర్ సింగ్ రాణా మంగళవారం నాడు వివాహం చేసుకొన్నాడు. పూలన్దేవి హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న షేర్ సింగ్ కొంతకాలం కిందట బెయిల్ మీద బయటకు వచ్చాడు.
మధ్యప్రదేశ్కు చెందిన మాజీ ఎమ్మెల్యే కూతురు ప్రతిమా సింగ్ను షేర్ సింగ్ మంగళవారం నాడు వివాహం చేసుకొన్నాడు. ఉత్తరాఖండ్లోని రూర్కీలో వైభవంగా ఈ వివాహం జరిగింది..అంతా దేవుడి మీద భారం వేశాను. కేసు నుంచి బయట పడేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందేనని' షేర్ సింగ్ మీడియాకు చెప్పారు.
బందిపోటుగా జీవనం సాగించిన అనంతరం ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్న పూలన్దేవి సమాజ్వాది పార్టీ లో చేరారు. ఎస్పీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2001 జూలై 25న ఢిల్లీలోని తన నివాసం ముందు ఆమె హత్యకు గురైన విషయం తెలిసిందే.
పార్లమెంటు సమావేశాలకు హాజరై మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన ఆమెను షేర్ సింగ్ రాణా సహా ముగ్గురు దుండగులు అతి దగ్గర నుంచి ఆమెను కాల్చి చంపారు. 2014 ఆగస్టులో ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించగా రాణా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. 2016లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.