దీదీ ఫైర్ః శారదా స్కాం ఆస్తులను అమ్మిన డబ్బు ఏం చేశారు? సహారా సంగతేంటీ?
కోల్కతః రెండు కుంభకోణాలు, వేల కోట్ల రూపాయలు దోపిడీకి గురైనట్టు భావిస్తోన్న రెండు కుంభకోణాలు పశ్చిమ బెంగాల్ను కొద్దిరోజులుగా కుదిపేస్తున్నాయి. దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ముద్ర ఉన్న మమతా బెనర్జీ ప్రతిష్ఠ ఈ రెండు కుంభకోణాల వల్ల మసక బారుతోంది. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్..తన ప్రభుత్వంపై పగ తీర్చుకోవడానికి కూడా ఈ రెండు కుంభకోణాలు అవకాశం ఇచ్చినట్లుగా భావిస్తున్నారు మమతా బెనర్జీ.
ఈ రెండూ అడ్డుగా లేకపోయి ఉంటే.. తన జైత్రయాత్రకు తిరుగు ఉండదని యోచిస్తున్నారు. శారదా పోంజి, రోజ్వ్యాలీ కుంభకోణాలను అడ్డుగా పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సీబీఐ ద్వారా తనను ఇబ్బందులకు గురి చేస్తోందనేది దీదీ అభిప్రాయం. ఈ కేసుల్లో భాగంగా కోల్కత నగర పోలీసు కమిషనర్ను విచారించడానికి వచ్చిన సీబీఐ అధికారులను జైలు పాలు చేయడం కూడా మమతా బెనర్జీకి చెడ్డ పేరు తీసుకొచ్చిందని అనుమానిస్తున్నారు.
ఆయా అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆమె సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సామాన్య ప్రజలకు కూడా చేరువ చేయడానికి అత్యుత్తమ మార్గంగా ఆమె సామాజిక మాధ్యమాలను ఎంచుకున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మధ్యమాల ఆధారంగా ఈ రెండు కుంభకోణాల అసలు విషయాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె నేతృత్వం వహిస్తోన్న తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శారదా, రోజ్వ్యాలీ కుంభకోణాలపై తెలుసుకోవాల్సిన ఆరు అంశాలు..అనే ఈ వీడియో వైరల్గా మారింది.
ఈ రెండు చిట్ఫండ్స్ 1980లో ఆరంభమయ్యాయి. అప్పట్లో పశ్చిమ బెంగాల్లో అధికారం ఉన్నది వామపక్షాలే. వామపక్ష ప్రభుత్వం చిట్ఫండ్స కంపెనీలకు అనుమతి ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అత్యంత కీలకమైన పురోగతి సాధించింది. శారదా చిట్ఫండ్ సంస్థ యజమానిని మమతా బెనర్జీ ప్రభుత్వమే అరెస్టు చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ కుంభకోణంపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించామని తృణమూల్ కాంగ్రెస్ వెల్లడించింది. అంతేకాకుండా- శ్యామల్ సేన్ కమిషన్ను కూడా ఏర్పాటు చేశామని వివరించింది. దీనిద్వారా 300 కోట్ల రూపాయలను వెనక్కి తెప్పించి, బాధిత డిపాజిటర్లకు అందజేసినట్లు పేర్కొంది.
దేశంలో శారదా, రోజ్ వ్యాలీ చిట్ఫండ్ల కుంభకోణాలు మాత్రమే చోటు చేసుకోలేదని, గుజరాత్లో 49 వేల కోట్ల రూపాయల విలువ చేసే పీఏసీఎల్ చిట్ ఫండ్ కుంభకోణం సంగతి ఏమైందంటూ నిలదీశారు. దీనిపై గుజరాత్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని తృణమూల్ డిమాండ్ చేసింది. ప్రధాని నరేంద్రమోడీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పీఏసీఎల్ కుంభకోణం చోటు చేసుకన్నదని, దీనిపై ఏ చర్య తీసుకున్నారని నిలదీసింది. వేల కోట్ల రూపాయల సహారా ఇండియా కుంభకోణంలో బీజేపీ నాయకుల పాత్ర లేదా? అంటూ ఆ పార్టీ ఎదురుదాడికి దిగింది.
ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న బీజేపీ నేతలపై ఏ చర్య తీసుకున్నారని ప్రశ్నించింది. శారదా, రోజ్ వ్యాలీ కుంభకోణాలపై విచారణను సీబీఐ తన చేతుల్లోకి తీసుకున్న తరువాత తమ ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని, డిపాజిటర్ల సొమ్మును వెనక్కి తేవడంలో ఎలాంటి పాత్రను పోషించట్లేదని వివరణ ఇచ్చింది. విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు శారదా, రోజ్వ్యాలీ సంస్థలకు చెందిన వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను విక్రయించారని, ఈ డబ్బును ఏం చేశారో దేశ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేసింది. ఏ ఒక్క బాధిత డిపాజిటర్ కైనా ఈ మొత్తాన్ని ఇచ్చారా? అని ప్రశ్నించింది తృణమూల్.