ప్రేమించలేదని టెక్కీ హత్య, ఆమెపై అత్యాచారం కూడా?
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని గిండీలో ఓ కాల్ సెంటర్లో పనిచేసిన 24 ఏళ్ల యువతి తనను ప్రేమించకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నదన్న కసితో ఓ ప్రేమోన్మాది ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెను ముక్కలుగా నరికి గోనె సంచిలో మూటగట్టి పోరూరు సమీపంలోని మంచినీటి చెరువులో పడవేసాడు.
మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం - అమ్మాయి అన్నైసత్యానగర్ లోని నెసపాక్కంలో ఉంటోంది. ఆమెకు మూడు నెలల క్రితం వివాహం జరిగింది. తన భార్య మే నెల 1వ తేదీ నుంచి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతలో పోరూరు చెరువులో గుర్తు తెలియని యువతి శవం లభ్యం కావడంతో ఆ మృతదేహం ఆమెదేమోనని భర్త శ్రీరాంకు సమాచారం అందించారు. మృతదేహం తన భార్యదే కావడంతో అతడు గుర్తించాడు.
అనంతరం పోలీసులు అతడిని విచారించారు. వివాహానికి ముందు తన భార్య గిండీలోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తుండేదనీ, ఆ సమయంలో అదే సంస్థలో పనిచేసే కాల్ టాక్సీ డ్రైవరు శ్యాంసన్ ఆమెను ప్రేమించినట్లు తెలిపాడు. అయితే అప్పటికే ఆమె తానూ ప్రేమించుకుంటున్నామనీ, ఇదే విషయాన్ని శ్యాంసన్ కు తెలిపి తనను ఇబ్బందిపెట్టవద్దని రేఖ అతడిని వేడుకున్నట్లు తెలిపాడు.
అయినప్పటికీ శ్యాంసన్ వేధింపులు కొనసాగుతుండటంతో ఆమెను కాల్ సెంటర్ ఉద్యోగం నుంచి శ్రీరాం మాన్పించినట్లు తెలియజేశాడు. ఆ తర్వాత తన భార్యపై కక్ష పెంచుకున్న శ్యామ్సన్ ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు.
శ్రీరాం చెప్పిన సమాచారం మేరకు నిందితుడి కోసం పోలీసులు గాలించారు. అతడి సెల్ ఫోన్ స్విచాఫ్ లో ఉన్నట్లు తేలింది. దీంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర యత్నం చేస్తున్నారు. కాగా మృతురాలిపై నిందితుడు అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేశాడా అనే విషయం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తేలుతుందని పోలీసులు వెల్లడించారు.