హాకీ క్రీడాకారిణి అదృశ్యం, సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్... రంగంలోకి పోలీసులు
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్కు చెందిన 16 ఏళ్ల రాష్ట్ర స్ధాయి హాకీ క్రీడాకారిణి అదృశ్యమైన ఘటన బరేలీలో జరిగింది. జార్ఖండ్లో జరిగిన అండర్ - 17 హాకీ చాంపియన్ షిప్లో పాల్గొన్న హాకీ క్రీడాకారిణి కరిష్మా తిరిగి తన సొంతూరు బరేలీకి రాలేదని పోలీసులు సోమవారం తెలిపారు.
రాంచిలో జరిగిన హాకీ చాంఫియన్ షిప్లో పాల్గొన్న అనంతరం జనవరి 7న కరిష్మా జలియావాలాబాగ్ ఎక్స్ప్రెస్లో స్వస్ధలానికి బయలుదేరినా... ఇప్పటి వరకు ఇంటికి రాలేదని ఆమె తల్లిదండ్రులు తెలిపారని పోలీసులు వెల్లడించారు.
టీమ్ మేనేజర్ రాహుల్ సింగ్తో పాటు మిగతా ప్లేయర్లు కరిష్మాను బరేలి వెళ్లేందుకు ఫైజాబాద్ వద్ద దిగబెట్టినా జనవరి 10 వరకు ఇంటికి రాలేదని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కరిష్మా సెల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులకు తెలిపారు. కరిష్మా అదృశ్యంపై దర్యాప్తును కొనసాగిస్తామని స్టేషన్ ఇన్చార్జ్ గుప్తా వెల్లడించారు.