మద్యం తాగొద్దన్నందుకు టీచర్ను కత్తితో పొడిచిన విద్యార్థి
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగొద్దన్నందుకు పాఠశాల ఆవరణలోనే టీచర్ను ఐదుసార్లు కత్తితో పొడిచాడు ఓ విద్యార్థి. దీంతో ఆ టీచర్ తీవ్రగాయాలపాలై నేలపై కుప్పకూలారు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. లివా సారెజ్ సమీపంలోని జవహర్లాల్ నవోదయ విద్యాలయం ఆవరణలో 12వ తరగతి విద్యార్థి మద్యం సేవిస్తుండగా అలెక్స్ మామి అనే టీచర్ అతడ్ని మందలించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ విద్యార్థి తన వద్ద ఉన్న కత్తితో దాడి చేసి ఐదుసార్లు పొడిచాడు.

తీవ్రగాయాలపాలైన టీచర్ను పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధిత టీచర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు.
టీచర్పై దాడికి పాల్పడిన నిందిత విద్యార్థిని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. అయితే అతని పేరు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామని చెప్పారు. ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications