4 గంటలు ప్రశ్నలు: చిరునవ్వులూ, మౌనంతో థరూర్
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ను ఢిల్లీ పోలీసులు సోమవారం సాయంత్రం నాలుగు గంటల పాటు విచారించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన విచారణ అర్థ రాత్రి దాటిన తర్వాత కూడా సాగింది. ఢిల్లీ ప్రత్యేక బృదం ఆయనను ప్రశ్నించింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే ఆయన వెళ్లిపోయారు. విచారణ సందర్భంగా జరిగిన వ్యవహారాలను వెల్లడించడానికి పోలీసులు కూడా నిరాకరించారు.
మరోసారి శశిథరూర్ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, శశి థరూర్ విచారణకు సహకరించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సునంద మృతి చెందిన రోజు ఏం జరిగిందనే విషయాలపై, ఐపియల్ వ్యాపార లావాదేవీలపై ఢిల్లీ పోలీసులు ఆరా తీశారు. మరింత మందిని విచారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు శశి థరూర్ కొన్నిసార్లు చిరునవ్వుతో సమాధానం ఇవ్వగా, మరికొన్ని సార్లు మౌనం పాటించినట్లు తెలుస్తోంది.

అదనపు డిసిపి కుష్వా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక బృందం ఆయనకు ప్రశ్నలు సంధించింది. సునంద మృతి కేసులో ఆయనను పోలీసులు ప్రశ్నించడం ఇదే తొలిసారి. సునంద మరణించిన రోజు నిరుడు జనవరి 17వ తేదీన ఏం జరిగింది, అంతకు ముందు జనవరి 15వ తేదీన తిరువనంతపురం నుంచి ఢిల్లీకి తిరిి వచ్చిన తర్వాత ధరూర్ను వదిలేసి సునంద పుష్కర్ ఎందుకు ఒంటరిగా గది తీసుకున్నారు, సునంద పుష్కర్ ఆరోగ్య పరిస్థితి ఏమిటి, పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్తో ఉన్న సంబంధం ఏమిట వంటి ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.
సునంద పుష్కర్ మృతదేహంపై ఉన్న 15 గాయాల గురించి, ముఖ్యంగా పదో నెంబర్ గాయంపై పోలీసులు థరూర్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సునంద పుష్కర్ ఏదైనా జబ్బుతో బాధపడుతూ ఉండేవారా, అయితే ఏ విధమైన మందులు తీసుకుంటున్నారు వంటి ప్రశ్నలు కూడా వేసినట్లు సమాచారం. పుకార్లు వచ్చినట్లుగా సునంద పుష్కర్ లుపుస్ (ఒక రకమైన చర్మవ్యాధి)తో బాధపడుతున్నారా అని కూడా అడిగారని అంటున్నారు.
శశిథరూర్ నీలం రంగు చొక్కా, నల్లటి జాకెట్ ధరించి దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ ఏరియాలో గల యాంటీ ఆటో తెఫ్ట్ స్క్వాడ్ కార్యాలయానికి విచారణ నిమిత్తం చేరుకున్నారు. సిట్ విచారణకు హాజరు కావడానికి ముందు శశి థరూర్ లోధీ ఎస్టేట్లోని తన నివాసంలో తన న్యాయవాదులతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications