ఉత్కంఠ: నేడు కర్ణాటకకు కావేరీ అగ్నిపరిక్ష
బెంగళూరు: నేడు కర్ణాటకకు కావేరీ అగ్నిపరిక్ష. గత మంగళవారం సుప్రీం కోర్టు ధ్విసభ్య ధర్మాసనం వారం రోజుల పాటు ప్రతి రోజు తమిళనాడుకు ఆరు వేల క్యూసెక్కుల కావేరీ జలాలు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టు ఉత్తర్వును కర్ణాటక అమలుపరచకపోవడంతో తమిళనాడు మళ్లీ అత్యున్నత న్యాయస్థాన్ని ఆశ్రయించింది. మంగళవారం రెండు గంటలకు ఈ వ్యాజ్యం విచారణకు రానుంది.
ఈ వ్యాజ్యంపై ధ్విసభ్య ధర్మాసనం ఎలా స్పందిస్తుందని దేశం అంతటా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక ప్రజలు కోర్టు ఎలా స్పందిస్తుందని ఎదురుచూస్తున్నారు. కావేరీ పరివాహకంలోని నాలుగు జలాశయాల్లో నీరు అడుగంటింది.
నీరు అడగంటినందున తాగునీటి అవసరాలకు తప్ప తమిళనాడు పంటసాగుకు నీరు విడుదల చెయ్యరాదని గత శుక్రవారం జరిగిన శాసన సభ, శాసన మండలిలో నిర్ణయించారు. 2002, 2005లో కేంద్రం ప్రకటించిన జాతీయ జలవిధానం ప్రకారం లభించిన నీటిని తాగేందుకే ప్రధాన్యమివ్వాలని పేర్కొంది.
ఆరకంగా తమ తీర్మానాలు సహేతుకమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. రాష్ట్ర ప్రజల, రైతుల ప్రయోజనాలు కాపాడటం ముఖ్యమంత్రి ప్రథమ కర్తవ్యం అని సిద్దరామయ్య శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో చెప్పారు.
శాసన సభ చేసిన తీర్మానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని. గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను రెండు సార్లు పాటించాం. మూడో ఆదేశాన్ని పాటించలేం. అంతమాత్రాన తాము సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు భావించరాదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభలో చెప్పారు.
కావేరి పర్యవేక్షక సమితి తమిళనాడుకు ప్రతి రోజూ మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ కర్ణాటక సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
తమిళనాడుకు ఆరు వేల క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తరువాత కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు నీరు విడుదల చెయ్యలేదు. కోర్టు ఆదేశాలను పాటించడం లేదని గత శుక్రవారం సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు అయ్యింది.
సాంబా (వరి)పంట రక్షణకు 17.5 టీఎంసీల కావేరీ నీరు విడుదల చేయాల్సిందింగా కర్ణాటకను ఆదేశించాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. అత్యున్న న్యాయస్థానం తీర్పు కోసం కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.