పట్టాలు తప్పిన మరో ఎక్స్ ప్రెస్: రెండు నెలల్లో రెండో ప్రమాదం
పాట్నా: రైలు ప్రమాదాలకు బిహార్ కేరాఫ్ అడ్రస్ గా మారినట్టుంది. నెలకో ప్రమాదం చొప్పున వరుసగా రెండో నెలల్లో రెండు ఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరిలో ఓ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఉదంతం రేపిన ప్రకంపనలు తగ్గకముందే- మరో ఉదంతం ముందుకు వచ్చింది. ఏకంగా 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పినప్పటికీ.. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్: సొంత పార్టీ నేతలే కారణమంటూ ముందే హెచ్చరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
ఆదివారం ఉదయం బిహార్ లోని ఛాప్రా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుజరాత్ లోని సూరత్ నుంచి బయలుదేరిన తాప్పీ-గంగా ఎక్స్ ప్రెస్ ఉదయం 9:15 నిమిషాల సమయంలో జిల్లాలోని గౌతమ్ స్థాన్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. రైలుకు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఆరుమంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఛాప్రాలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఉదయం 8 గంటలకు ఛాప్రా జంక్షన్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ రైలు గౌతమ్ స్థాన్ స్టేషన్ కు కొద్ది దూరంలో ప్రమాదానికి గురైంది.
కిందటి నెల 3వ తేదీన కూడా బిహార్ లో ఓ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. జగ్బాణి-ఆనంద్ విహార్ టెర్మినల్ రైలు ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఏడుమంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. 11 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారు ఇప్పుడిప్పుడే ఆ భయానక జ్ఞాపకాల నుంచి కోలుకుంటున్నారు. అదే సమయంలో- మరోసారి బిహార్ లోనే రైలు పట్టాలు తప్పడం కలకలం రేపింది.