పదవి కాపాడుకోవడానికి ఇలా కూడానా?: ఏకంగా 50మేకపోతుల్ని బలిచ్చి!..
తొలుత వేదారణేశ్వర్ ఆలయంలో పూజల అనంతరం.. అక్కడి నుంచి మునీశ్వర ఆలయానికి చేరుకుని 50మేకపోతులను బలిచ్చారు.
చెన్నై: మంత్రం ఉచ్చరించడమే సకల సమస్యలకు పరిష్కార మార్గమనే గుడ్డి విషయాన్ని ఇప్పటికీ చాలామంది అనుసరిస్తూనే ఉన్నారు. సామాన్యులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఇందుకు అతీతమేమి కాదు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ మంత్రి కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. చిత్రంగా.. పదవి రక్షణ పూజలు చేసి వార్తల్లోకి ఎక్కారు.
నాగపట్నం జిల్లా వేదారణ్యం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓఎస్ మణికేయన్ ఆదివారం నాడు ఈ పూజలు నిర్వహించారు. వరుణయాగం అని తొలుత చెప్పినప్పటికీ.. ఆ తర్వాత పదవి రక్షణ పూజలు నిర్వహించారు. ఇందుకు గాను ఏకంగా 50మేకపోతులను బలి ఇచ్చి పూజలు చేశారు.
దివంగత సీఎం జయలలిత మణికేయన్ ను మంత్రి చేశారు. ఆమె మరణానంతరం చిన్నమ్మ శశికళకు విశ్వాసపాత్రుడిగా ఉన్నారు. చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ కు సైతం మద్దుతుగా నిలిచారు. ఈ క్రమంలో సీఎం పళనిస్వామి వర్గంతో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. దీంతో ఆయనకు పదవి గండం భయం పట్టుకుంది. సీఎం తనను ఎక్కడ తప్పిస్తారోనన్న ఆందోళనలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు మణియన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యాగంకు అన్నాడీఎంకె వర్గాని చెందిన వ్యక్తులు తప్ప బయటివారెవరు హాజరుకాలేదు. తొలుత వేదారణేశ్వర్ ఆలయంలో పూజల అనంతరం.. అక్కడి నుంచి మునీశ్వర ఆలయానికి చేరుకుని 50మేకపోతులను బలిచ్చారు. పదవి గండం భయంతో ఆయన చేసిన పూజలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.