రేప్ వ్యాఖ్య: దిగొచ్చిన తపస్ పాల్, స్త్రీలకు క్షమాపణ
కోల్కతా: అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో తాను చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు తపస్ పాల్ దిగొచ్చారు. ప్రతిపక్ష నేతల మహిళలను తన కార్యకర్తలతో రేప్ చేయిస్తానని ఆయన చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపింది.
దేశంలోని మహిళలందరికీ ఆయన క్షమాపణ చెప్పారు. మహిళలకు క్షమాపణ చెబుతూ ఆయన రాసిన లేఖ పార్టీ అధికారిక వెబ్సైట్లో ప్రచురితమైంది. ఎన్నికల వేడిలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయని, తాను ఇందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని ఆయన అన్నారు.
ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ తాను ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఆయన అన్నారు. తపస్ పాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బేషరతు క్షమాపణ చెప్పాలని తపస్ పాల్కు పార్టీ సూచించినట్లు అంతకు ముందు తృణమూల్ కాంగ్రెసు సీనియర్ నేత ముకుల్ రాయ్ చెప్పారు.
తన భర్త చేసిన వ్యాఖ్యలకు తపస్ పాల్ భార్య నందినీ పాల్ మంగళవారం ఉదయమే క్షమాపణలు చెప్పారు. తపస్ పాల్ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు.