పన్న ఎగవేత సామాజిక అన్యాయం.. ఈ వివాదాల్లో వేగం అవసరం: సీజేఐ బోబ్డే
న్యూఢిల్లీ: పన్ను సంబంధిత వివాదాల్లో వేగవంతమైన పరిష్కారం అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. ఇది ఒక రకంగా పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహమని అభిప్రాయపడ్డారు. వివాదాల్లో చిక్కుకున్న నగదును విడుదల చేయడమేనని అన్నారు.
ఇన్కం టాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ 79వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో సీజేఐ పాల్గొని ప్రసంగించారు. పన్ను ఎగవేత సామాజిక అన్యాయమని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అలాగే, ఏకపక్షంగా పన్నులు వేయడం కూడా సామాజిక అన్యాయానికి కారణమవుతుందని అన్నారు.

వనరుల సమీకరణలో పన్ను న్యాయవ్యవస్థ చాలా ముఖ్యమైనదన్నారు. ఈ విషయంలో కేసులు పెండింగ్లో ఉండరాదన్నారు. న్యాయవ్యవస్థలో కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్) అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే, విచక్షణతో న్యాయాన్ని వెలువరించే మనిషికి ప్రత్యామ్నాయం కారాదని సీజేఐ వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితి పెంచుతుందనే అంచనాలు నెలకొన్నాయి. మధ్యతరగతి జీవులకు ఉపశమనం కలిగిస్తుందని అందరూ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications