ట్విస్ట్: అవిశ్వాసంపై టిడిపి తిరకాసు, మద్దతు కోసమా?
తెలుగుదేశం పార్టీ కూడా అవిశ్వాసం నోటీసు ఇచ్చింది. అయితే టిడిపి వ్యూహాత్మక వైఖరిని అవలంభించింది. పార్లమెంటులో మెజార్టీ పార్టీలు లేదా సభ్యులు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారు. అధికార పక్షంలో కీలకంగా ఉన్న కాంగ్రెసు, ప్రతిపక్షంలో ప్రధాన పార్టీ భారతీయ జనతా పార్టీలు విభజనకు మద్దతుగా ఉన్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ పరోక్షంగా విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ తెలంగాణకు అనుకూలంగా ఉంది.
దీంతో టిడిపి ఎంపీలు సాధ్యమైనంత వరకు విభజన అంశాన్ని పక్కన పెడుతున్నారు లేదా విభజన తీరును తప్పు పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ అంశంపై అవిశ్వాస నోటీసు ఇస్తే అది నెగ్గే అవకాశాలు తక్కువ అని భావించినందు వల్ల వారు వ్యూహాత్మకంగా ధరల పెరుగుదల, అవినీతి అంశాల పైన ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
తాము అవినీతి, దేశ భద్రత, ధరల పెరుగుదల పైనే అవిశ్వాసం నోటీసు ఇచ్చినట్లు ఆ పార్టీ ఎంపీలు చెబుతున్నారు. తెలంగాణ కాకుండా మిగతా అంశాల పైన అవిశ్వాసం అంటే ప్రధాన ప్రతిపక్షం బిజెపి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని టిడిపి భావిస్తోంది. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ తప్ప మిగిలిన అంశాలపై అవిశ్వాసం పెడితే బిజెపి కలిసి వస్తుందని ఎంపీలు భావిస్తున్నారు.