యుపిలో దారుణం: యువతిపై ముగ్గురు గ్యాంగ్రేప్
రాయ్బరేలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జగత్పూర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పొలం పనుల నిమిత్తం వెళ్లిన యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులను ధర్మేష్ కుమార్, ప్రమోద్ కుమార్, అరవింద్ కుమార్లుగా గుర్తించినట్లు చెప్పారు.
అత్యాచారానికి పాల్పడిన అనంతరం స్పృహ కోల్పోయిన అమ్మాయిని అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. ఇంటి నుంచి వెళ్లిన కూతురు ఎంత సేపయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టారు.
పొలంలో అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన బాధిత యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.