టెర్రర్ జర్నీ: ఫుట్ బోర్డింగ్ ప్రయాణం చేశారు... రైలు నుంచి జారి పడి చనిపోయారు
చెన్నై: ప్రభుత్వాలు ఎన్నిసార్లు చెప్పినా యువత మాత్రం మారనంటోంది. ఫుట్ బోర్డు పై ప్రయాణం ప్రమాదకరం అని హెచ్చరికలు పెట్టిన వాటిని మాత్రం యువత పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయి కన్నవారికి శోకం మిగులుస్తోంది. ఇప్పటికే బస్సుల్లో ఫుట్ బోర్డింగ్ పై ప్రయాణిస్తూ చాలామంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ కళ్లారా చూసి కూడా మాకేం కాదులే అన్న ధీమాతో యువత ఇంకా సర్కస్ ఫీట్లు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటోంది.
తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో ఫుట్ బోర్డింగ్ పై ప్రయాణం చేసి ఐదుమంది యువకులు మృతి చెందారు. అప్పటి వరకు పక్కన వారితో మాట్లాడుతూ ప్రయాణం కొనసాగించిన వీరు ఒక్క క్షణంలోనే ప్రాణాలను వదిలారు. చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సెయింట్ థామస్ రైల్వే స్టేషన్లో ఓ లోకల్ ట్రైన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. దీంతో చాలామంది ఫుట్బోర్డుపై నిల్చొని ప్రయాణం చేశారు. రైలు వేగం అదుకుంది. కొంత దూరం వెళ్లాక కరెంటు స్తంభం వారికి తగలడంతో రైలులో నుంచి కింద పడ్డారు. రైలు అప్పటికే వేగం మీద ఉండటంతో జారికింద పడ్డ వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.