ఉగ్ర ముప్పు: సౌతిండియా విమానాశ్రయాల్లో హై అలర్ట్
హైదరాబాద్: ఉగ్రవాదులు వాదుల నుంచి ముప్పు పొంచి వుందన్న సమాచారంతో దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కొచ్చి మంగళూరు, తిరువనంతపురంలలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ తోపాటు అన్ని ఎయిర్ పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని ప్రధాన ఎయిర్ పోర్టులకు బిసిఏఎస్ ఈ హెచ్చరికలను జారీ చేసింది.
కారు బాంబులతో దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. పార్కింగ్ వాహనాలతోపాటు ఎయిర్ పోర్టుల్లోని అన్ని వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఎయిర్ పోర్టుల ప్రధాన రహదారుల్లో కూడా తనిఖీలు చేపట్టాలని సూచించింది. ఎయిర్ పోర్టుల్లో గత కొద్ది రోజులుగా పార్కింగ్ చేసిన వాహనాలను అక్కడ్నుంచి తొలగించాలని ఆదేశించింది.
ఇటీవల చెన్నై విమానాశ్రయంలో శ్రీలంక నుంచి వచ్చిన ఓ ఐఎస్ఐ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతన్ని విచారిస్తున్నారు. ఈ విచారణలో అతను తెలిపిన వివరాల ప్రకారం తీవ్రవాదులు విమానాశ్రయాల్లో బాంబులు అమర్చే ప్రయత్నంలో ఉన్నట్లు తేలింది. దీంతో అన్ని విమనాశ్రయాల్లో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో పర్యవేక్షణలో భద్రతను పెంచారు.
ప్రధాన ఎయిర్ పోర్టుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలి గుంటూరుకు చెందిన స్వాతి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 14 తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఎక్కడా మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.