ఒక్క ఓటు.. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇది తమిళనాడుకే సాధ్యం : ఎద్దేవా చేసిన స్టాలిన్
ఒక్క ఓటుకు ముగ్గురు ముఖ్యమంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించడం ఒక్క తమిళనాడులో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా జరగదని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఎద్దేవా చేశారు.
చెన్నై: ఒక్క ఓటుకు ముగ్గురు ముఖ్యమంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించడం ఒక్క తమిళనాడులో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా జరగదని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఎద్దేవా చేశారు.
తిరుచ్చిలో సోమవారం ఓ వివాహంలో పాల్లొన్న ఆయన.. పెళ్లిలో రాజకీయాలు మాట్లాడకూడదంటూనే.. ఓ పిట్ట కథ చెప్పారు. ''ఒక ఊరిలో ఓ ఏరు ఉండేది. పక్కనే ఉన్న గ్రామస్థులు రోజూ ఆ ఏటిని పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టు ద్వారా దాటేవారు. ఓ అయిదారేళ్ల తరువాత ఆ ప్రాంతమంతా ఎడారిలా మారింది. దీంతో ప్రజలు ఆ ఏటిలో దిగి నడుచుకుంటూ అవతలి గట్టుకు చేరుకునేవారు.
కానీ ఉన్నట్లుండి.. ఆ ఏట్లోకి భారీ స్థాయిలో నీళ్లు వచ్చి చేరాయి. ఫలితంగా ఆ మహా వృక్షం కూడా మునిగిపోయింది. దీంతో అవతలి ఒడ్డుకు ఎలా చేరుకోవాలో తెలియక గ్రామస్థులు ఆలోచనలో పడ్డారు.
ఏటి గట్టునే ఓ దుంగ కనిపించడంతో.. దాని సాయంతో ఏరు దాటవచ్చనుకుని కొందరు దానిపైకెక్కారు. సగం దూరం ప్రయాణించాక తెలిసింది.. అది దుంగ కాదు, మొసలి అని! దీంతో వారు తమను కాపాడమని కేకలు పెట్టారు.
గట్టుపైనున్న మరి కొందరు ''మిమ్మల్ని కాపాడేందుకు ఓ పడవ తీసుకొస్తాం. అప్పటి వరకు మీరు ప్రాణాలతో ఉండండి..'' అని వారికి సలహా ఇచ్చారు. ఇదీ కథ.. అంటూ ప్రస్తుత తమిళనాడు రాజకీయాలకు ఈ కథను అన్వయించి చెప్పిన స్టాలిన్.. ముక్తాయింపుగా.. ''నన్ను సమస్యలోకి నెట్టకండి..'' అంటూ తప్పించుకున్నారు.