జైల్లో జయ: ఇడ్లీ తెచ్చిన మంత్రులు-కుర్చీకి నో, వీరంగం
బెంగళూరు/చెన్నై: జయలలితకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీఎంకే ఆదివారం బందుకు పిలుపునిచ్చింది. తమిళనాడు వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డీఎంకే నేతలు, సుబ్రహ్మణ్య స్వామి ఇంటి వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
అక్రమార్జన కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగుళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల శిక్ష విధించిన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జయలలిత నివాసం వద్ద, తిరుచ్చి, మధురైలో ముగ్గురు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
మిగిలిన కార్యకర్తలు ఆఖరి క్షణంలో గుర్తించి వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కోర్టు తీర్పును జీర్ణించుకోలేని అన్నాడీఎంకే కార్యకర్తలు డీఎంకే నేతల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలపై రాళ్లతో దాడి చేశారు.
ఇడ్లీ తిన్న జయలలిత
బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న జయలలితను ఆదివారం ముగ్గురు రాష్ట్ర మంత్రులు, జయ వ్యక్తిగత కార్యదర్శి కలిశారు. ఆమెకు అల్పాహారం, తమిళ దినపత్రికలు ఇచ్చారు. మంత్రులు తెచ్చిన ఇడ్లీని ఆమె అల్పాహారంగా తీసుకున్నారు. కాగా, మంత్రులు తమతోపాటు జయలలిత వ్యక్తిగత కుర్చీని తీసుకురాగా, జైలు అధికారులు దాన్ని లోపలికి అనుమతించలేదు. జయలలిత ఎక్కడ పర్యటన జరిపినా, సిబ్బంది ఈ కుర్చీని కూడా తీసుకు వెళుతుండేవారు.