ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య కేసు: సూసైడ్ నోట్లో ఫాతిమా చెప్పిన ప్రొఫెసర్లను విచారణ చేసిన సిట్
చెన్నై: చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆత్మహత్యకు పాల్పడిన హ్యూమానిటీస్ విద్యార్థిని ఫాతిమా లతీఫ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ సోమవారం సాయంత్రం ముగ్గురు ప్రొఫెసర్లను విచారణ చేసింది. నవంబర్ 9వ తేదీన తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన ఫాతిమా ఓ సూసైడ్ నోట్ను రాసింది. సూసైడ్నోట్లో ఆమె ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను రాసింది. వారిని సిట్ బృందం సోమవారం సాయంత్రం విచారణ చేసింది.
ఐఐటీ మద్రాస్ విద్యార్థిని ఆత్మహత్య, మొబైల్ లో సూసైడ్ నోట్, ఉత్తరాధి ప్రొఫెసర్లు !
ఫాతిమా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనేదానిపైనే సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. నవంబర్ 9న ఫాతిమా తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఆమె ఎంతసేపటికీ ఫోన్ తీయకపోవడంతో ఏమైందో అన్న కంగారుతో ఆమె స్నేహితురాలు అయిన అలీమా సంతోష్కు ఫోన్ చేసి తన కూతురుకు ఫోన్ ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే ఫాతిమా గదికి వెళ్లిన అలీమా ఫాతిమా మృతి చెంది ఉండటం గమనించింది. ఇదిలా ఉంటే ఫాతిమా తండ్రిని కూడా సిట్ అధికారులు విచారణ చేశారు. అంతేకాదు మరికొంతమంది హాస్ట్ల్ విద్యార్థులను సిట్ బృందం విచారణ చేయనుంది.
ఫాతిమాకు పాఠాలు చెబుతున్న సిబ్బందే ఆమె ఆత్మహత్యకు కారణం అని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం వరకు డెడ్లైన్ విధించారు. ఇదిలా ఉంటే ఫాతిమా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నట్లుగా టీచింగ్ ఫ్యాకల్టీపై అంతర్గత విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు విద్యార్థులు క్యాంపస్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. హ్యూమనిటీస్ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న అజార్ మొయీద్దీన్, పీహెచ్డీ చేస్తున్న జస్టిన్ జోసెఫ్లు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వారు ప్లకార్డులను ప్రదర్శిస్తూ అంతర్గత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాదు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఇద్దరు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.