మూడేళ్ల చిన్నారిని రేప్, 20 గంటల్లో నిందితుడు అరెస్ట్.. నెక్స్ట్ ఏమైందంటే ?
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని అపహరించి అత్యాచారం చేయడం దేశ వ్యాప్తంగా కలకలంగా మారింది. ప్రస్తుతం పాప పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురువారం తెల్లవారుజామున, లక్నో ఐఎస్బీటీ-మెట్రో ప్రాంతం సమీపంలోని వంతెన కింద తల్లితో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని నిందితుడు అపహరించాడు. కొద్దిసేపటికి నిద్రలేచిన కుటుంబ సభ్యులు పాప కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అతడి దుర్మార్గానికి గురైన బాలికను సుమారు 500 మీటర్ల దూరంలో తీవ్ర గాయాలతో ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.

నిందితుడిపై రివార్డు..
ఇక ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆలంబాగ్ మెట్రో స్టేషన్ సమీపంలో నిందితుడు చిన్నారిని స్కూటర్పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం గుర్తించారు. దీంతో స్కూటర్ రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా నిందితుడిని దీపక్ వర్మగా గుర్తించారు. కాగా వర్మపై గతంలోనే లక్నోలోని పలు పోలీస్ స్టేషన్లలోక్రిమినల్ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. అంతే కాకుండా నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డును సైతం ప్రకటించారు.
ఎన్ కౌంటర్..
సమాచారం మేరకు కంటోన్మెంట్ ప్రాంతంలోని దేవి ఖేడా వద్ద పోలీసులు నిందితుడిని అడ్డగించారు. లొంగిపొమ్మని హెచ్చరించగా.. దీపక్ వర్మ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపడంతో వర్మ తీవ్రంగా గాయపడ్డాడని స్పష్టం చేశారు. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడిని 20 గంటల్లోనే పట్టుకోవడం పట్ల పోలీసులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications