రెండే రెండు ఆప్షన్స్.. గవర్నర్ ఏం నిర్ణయించబోతున్నారు?
గవర్నర్ ముందున్న ఆప్షన్స్: ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను బల నిరూపణకు ఆహ్వానించడం.. మరొకటి అసెంబ్లీని ఏర్పాటు చేసి సభలోనే సభా నాయకుడిని ఎన్నుకోమని సూచించడం..
చెన్నై: సుప్రీం తీర్పుతో తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడగా.. సీఎం పీఠాన్ని ఎవరు అధిష్టించబోతున్నారన్న మరో ఉత్కంఠ ఇప్పుడు అందరిలోను మొదలైంది. ప్రభుత్వ పగ్గాలు ఎట్టి పరిస్థితుల్లోను పన్నీర్ చేతుల్లోకి వెళ్లొద్దనే ఉద్దేశంతో పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా శశికళ సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం గవర్నర్ విద్యాసాగర్ రావు ముందు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను బల నిరూపణకు ఆహ్వానించడం.. మరొకటి అసెంబ్లీని ఏర్పాటు చేసి సభలోనే సభా నాయకుడిని ఎన్నుకోమని సూచించడం.. ఈ రెండింటిలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.

ఇప్పటివరకైతే గవర్నర్ నిర్ణయానికి సంబంధించి రాజ్ భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే, ఆనందోత్సాహాల్లో మునిగిపోయిన పన్నీర్ వర్గం కోర్టు తీర్పుతో సంబరాలు జరుపుకుంటున్నారు. సీఎం తానే అన్న ధీమా పన్నీర్ లో కనిపిస్తున్నా.. చివరికి ఆయన వెనక ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలబడుతారన్నది వేచిచూడాలి.












Click it and Unblock the Notifications