ఇండియా బ్లాక్కు సమాజ్వాదీ పార్టీ గుడ్ బై..అదే కారణం..?
మహావికాస్ అఘాఢీకి బీటలు పడుతున్నాయి. గత నెలలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి మూటగట్టుకున్న ఈ కూటమికి సమాజ్వాదీ పార్టీ రూపంలో మరో షాక్ తగిలింది. కూటమికి గుడ్ బై చెప్పేసింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు 32 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన నేత మిలింద్ నర్వేకర్ న్యూస్పేపర్లలో వ్యతిరేకంగా యాడ్స్ ఇవ్వడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సమాజ్ వాదీ పార్టీ. బాబ్రీ మసీదు కూల్చివేతను ఒక వేడుకతో పోల్చడాన్ని అఖిలేష్ యాదవ్ పార్టీ తప్పుబట్టింది.
ఎక్స్లో నవ్రేకర్ మసీదు కూల్చివేత ఫోటోను, దానిపక్కనే శివసేన వ్యవస్థాపకులు బాల్థాక్రే ఫోటోను జతచేసి పోస్టు చేశారు. మసీదు కూల్చివేసిన వారిని చూస్తే గర్వంగా ఉందని బాల్థాక్రే చెబుతున్నట్లుగా కామెంట్స్ రాశారు.అంతేకాదు ఇదే పోస్టులు ఉద్దవ్ థాక్రే, ఆదిత్య థాక్రే, నర్వేకర్ల ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ పోస్టుపై సమాజ్ వాదీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ చీఫ్ అబు అజ్మీ ఈ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "శివసేన చేసిన ఈ పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయి. బాబ్రీ మసీదును కూల్చివేసిన వారిని అభినందించడం తప్పు. మహావికాస్ అగాఢీలో ఎవరైనా ఇలాంటి పోస్టులు పెడితే ఇక బీజేపీకి వారికి తేడా ఏముంది..? వారితో కలిసి ఎలా నడవగలం" అని అబు అజ్మీ ప్రశ్నించారు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే మహా వికాస్ అగాఢీ కూటమిలో విబేధాలున్నాయనే విషయాన్ని అబు అజ్మీ చెప్పారు. ఎప్పుడూ సమాజ్ వాదీ పార్టీ అభిప్రాయాన్ని తెలిపేందుకు కూటమి నాయకులు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. టికెట్ల కేటాయింపులో కూడా తమను పరిగణలోకి తీసుకోలేదని వాపోయారు. కూటమిలోని పార్టీల మధ్య సహాయసహకరాలు లోపించాయని అన్నారు.
మహాయుతి కూటమి మధ్య విబేధాలు వచ్చి సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ మహావికాస్ అగాఢీ నుంచి సమాజ్ వాదీ పార్టీ బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.మహారాష్ట్ర అసెంబ్లీలో సమాజ్వాదీ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. ఇక సమాజ్వాదీ పార్టీ మహావికాస్ అగాఢీ నుంచి బయటకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే సమాజ్ వాదీ పార్టీ అధినాయకత్వంతో చర్చించేందుకు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నేత సుప్రియా సూలే ముందుకొచ్చారు. జాతీయ రాజకీయాల్లో తాము అఖిలేష్ యాదవ్తో చాలా దగ్గరగా కలిసి పనిచేస్తున్నామని సుప్రియా సూలే అన్నారు.అయితే మహారాష్ట్రలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తనకు సమాచారం లేదని చెప్పారు.అఖిలేష్ యాదవ్తో మాట్లాడి తిరిగి కూటమిలో చేరేందుకు ఒప్పిస్తానని చెప్పారు. మరోవైపు సమాజ్వాదీ పార్టీ నేతలతో చర్చించి అసలు సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది.
ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాన్ని మహావికాస్ అగాఢీ నేతలు బాయ్కాట్ చేయగా, సమాజ్వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయడం కొసమెరుపు.












Click it and Unblock the Notifications