పఠాన్ కోట్ దాడి: పాక్ కు షాక్ ఇచ్చిన యూఎస్
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని ఇంతకాలం పాతపాట పాడిన పాకిస్థాన్ కు అమెరికా పెద్ద షాక్ ఇచ్చింది. పఠాన్ కోట్ దాడికి ఉపయోగించిన ఫేస్ బుక్ ఖాతాల ఐపీ అడ్రస్ లు పాకిస్థాన్ లోనే ఉన్నాయని ఆధారాలు సేకరించిన యూఎస్ వాటిని ఎన్ఐఏకి ఇచ్చింది.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అమెరికా మరింత బలాన్ని చేకూర్చింది. పఠాన్ కోట్ దాడి పాకిస్థాన్ నుంచే జరిగిందని పక్కా ఆధారాలను అమెరికా అధికారులు సేకరించారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న అల్ రహమత్ ట్రస్ట్ ఐపీ అడ్రస్ కూడా పాకిస్థాన్ లోనే ఉందని గుర్తించారు. దీని ప్రకారం పఠాన్ కోట్ దాడి జరిగే సమయంలో అల్ రహమత్ వెబ్ పేజీని రంగనూర్ డాట్ కామ్ అనే సైట్ లో, అల్కాలం ఆన్ లైన్ డాట్ కాం అనే మరో సైట్ లో అప్ లోడ్ చేశారు.
ఈ రెండింటికి కూడా తారిక్ సిద్దిఖీ ఒకే ఈ మెయిల్ ఉపయోగించారని అమెరికా ఆధారాలు సేకరించింది. పఠాన్ కోట్ దాడి సమయంలో ఉపయోగించిన ఈఐపీ అడ్రస్ లు పాకిస్థాన్ లో ఉన్నాయని తాము గుర్తించామని అమెరికా భారతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు ఆధారాలు సమర్పించింది.