14 మృతదేహాలు వెలికితీత: 30మంది మృతి, 25మంది గల్లంతు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 30 మందికి పైగా మృతి చెందారు. దీంతో శిథిలాల కింద చిక్కకున్న 14 మృతదేహాలను అతికష్టం మీద శనివారం ఉదయం నాటికి వెలికితీశామని పోలీసులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శుక్రవారం తెల్లవారుజామున చమోలి, పిత్తోరగడ్ జిల్లాలలోని ఆరు గ్రామాల్లో 30 మందికి పైగా మరణించగా, 25 మంది వరకు గల్లంతయ్యారు. అలకనంద నది ప్రమాదస్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తుంది.
వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో తీరప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ వరదల్లో సుమారు 60 ఇళ్లు వరకు నేలమట్టమయ్యాయి. గ్రామాల్లోని 200 పశువులు వరద నీటి ప్రవాహానికి కోట్టుకొని పోయాయి.
వేల ఎకరాల్లోని పంట ధ్వంసమైంది. ధార్చులా ప్రాంతంలో అలకనంద నది వరద ఉధృతికి సమీపంలోని గ్రామాలను కలిపే మూడు కీలకమైన వంతెనలు కొట్టుకుపోయాయి. థాల్-మున్స్యారీ రహదారి కోతకు గురవటంతో.. రెండువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
ఖరాడీ ప్రాంతంలో యమునోత్రి హైవేకూడా వర్షం ధాటికి దెబ్బతింది. వరద నీటి ఉధృతికి రెండు జిల్లాల్లోని రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. విద్యుత్కు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. మరోవైపు గంగోల్గావ్లో కొండచరియలు విరిగిపడ్డాయన్న వార్తలతో కేదర్నాథ్ యాత్రకు వెళ్లే వాహనాలను ఆపేశారు.
భారీ వర్షాలకు కేదర్నాథ్ యాత్రకు వెళ్లి యాత్రికులతో పాటు స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు సీఎం హరీశ్ రావత్ రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు 30 మంది చనిపోవటంపై ప్రధాని మోడీ ట్విటర్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.