గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్... ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు...
గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్ సంచలనం రేకెత్తిస్తోంది. దూబేది ఫేక్ ఎన్కౌంటరా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎన్కౌంటర్పై వివరణ ఇవ్వాలని అటు విపక్షాలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని,పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. దూబే ఎన్కౌంటర్పై తాజాగా పలువురు ప్రత్యక్ష సాక్షులు స్పందించారు.
ఆశిష్ పాశ్వాన్ అనే ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. 'మేము మా ఇంటికి వెళ్తుండగా... మా వాహనానికి కొంత దూరంలో సచెండీ ప్రాంతంలో తుపాకీ పేల్చిన శబ్దాలు వినిపించాయి. ఏం జరిగిందోనని దగ్గరికి వెళ్లగా.. పోలీసులు మమ్మల్ని అనుమతించలేదు.' అని చెప్పారు. సంఘటనా స్థలానికి అంబులెన్స్ ఎలా వచ్చిందని అడగ్గా.. అందరినీ సొంత వాహనంలోనే అక్కడినుంచి తరలించారని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పడం గమనార్హం.ఎన్ కౌంటర్ జరిగిన స్థలం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు.
Recommended Video
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో దూబే అరెస్టు తర్వాత... అతన్ని కాన్పూర్ తరలిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. దూబేని తరలిస్తున్న వాహనం బోల్తా పడటంతో... అతను పోలీస్ నుంచి గన్ లాక్కుని పరారయ్యేందుకు యత్నించాడని.. ఆ క్రమంలో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
అయితే దూబే ఎన్కౌంటర్పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎంతోమంది రాజకీయ నాయకులు,పోలీసులతో లింకులున్న దూబేని హత్య చేయడం ద్వారా...వారందరినీ కాపాడేందుకు ప్రయత్నించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దూబేని చట్టప్రకారం విచారించి ఉంటే వాళ్లందరి బండారం బయటపడేదని అంటున్నారు.
ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్నే నేర రహిత రాష్ట్రంగా మార్చాలంటే గ్యాంగ్స్టర్కు రాజకీయ నాయకులకు,అలాగే పోలీసులకు మధ్యనున్న లింకులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.