ఫణి తుఫానుతో కోస్తాంధ్రకు భారీ వర్షాలు : వాతావరణ శాఖ
చెన్నై : తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతానికి అనుకొని కొనసాగుతోందని తెలిపారు. ఇది చెన్నై తీరానికి 1440 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతమై వాయువ్యదిశగా ప్రయాణిస్తోందని చెప్పారు. వాయుగుండం శనివారం తుఫాన్ గా మారనుందని వెల్లడించారు.

ఫణి తుఫాన్
ఈ తుఫాన్ కు ఫణి అనే పేరును పెట్టాలని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తుఫాను తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. అయితే తుఫాన్ తీరం దాటే సమయంలో మాత్రం గంటకు 90 నుంచి 115 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
భారీ వర్షాలు
తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నెల 30, మే 1 తేదీల్ల ఆయా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని .. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతోపాటు అలలు సాధారణం కంటే ఎక్కువగా ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు తక్షణమే తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications