క్రీడా జీవితంలో పెద్ద ఘటన: శ్రీశాంత్, కోర్టుకెళ్లే ఆలోచన!
కొచ్చి: స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో తన ప్రమేయం ఏమీ లేదని, తాను ఎలాంటి పొరపాటు చేయలేదని భారత పేసర్, రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రీశాంత్ పునరుద్ఘాటించాడు. బిసిసిఐ విధించిన జీవితకాల సస్పెన్షన్ను తన క్రీడాజీవితంలో ఎదురైన అతి పెద్ద సంఘటనగా అభివర్ణించాడు. తన తప్పేమీ లేదని, ఈ విషయం త్వరలోనే బయటపడుతుందని ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశాడు.
ఈ పరిస్థితి తనకు ఎందుకు ఎదురైందో ఇప్పటికీ అర్థం కావడం లేదని అన్నాడు. సస్పెన్షన్ నిర్ణయం బాధాకరమని, తనను మానసిక వేదనకు గురి చేసిందని శ్రీశాంత్ చెప్పాడు. తొమ్మిది సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పటికీ, తనకు ఎవరూ అండగా నిలవలేదని వాపోయాడు. ఈ ఆపత్కాలంలోనైనా అందరి మద్దతు తనకు లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పాడు. బిసిసిఐ నిర్ణయంతో శ్రీ షాక్ అయ్యారట. కాగా, శ్రీశాంత్కు కేరళ రాష్ట్రం అండగా నిలిచింది. పలువురు అధికారులు, అభిమానులు అతనికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
కోర్టుకెళ్లే యోచనలో శ్రీశాంత్!
కాగా, శ్రీశాంత్ బిసిసిఐపై కోర్టుకెళ్లే ఆలోచనలో ఉన్నారట! ఐపిఎల్-6లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన ఈ కేరళ బౌలర్ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడు. దీనిపై విచారణ చేపట్టిన బిసిసఐ శ్రీశాంత్ను దోషిగా నిర్ధారించి జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మరో ఆటగాడు అంకిత్ చవాన్కూ అదే శిక్షను అమలు చేసింది.
కాగా, ఈ వ్యవహారంపై శ్రీ కోర్టును ఆశ్రయించనున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక శనివారం కథనాన్ని ప్రచురించింది. 'ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు ఇంకా కోర్టు విచారణలోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బిసిసిఐ క్రమశిక్షణ కమిటీ.. తుది తీర్పు వెలువడే వరకు వేచి చూడాల్సింది. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కేవలం ఢిల్లీ పోలీసుల వాదనలు అనుసరించే రవి సవాని నివేదిక రూపొందించారు. కానీ, ఢిల్లీ పోలీసుల వాదనను కోర్టు కూడా ప్రశ్నించింది. ఈ విషయంపై శ్రీ శాంత్ కోర్టులో సవాలు చేస్తాడు' అని అతని సన్నిహితులు తెలిపారట.