కొడుకు కళ్లెదుటే మహిళపై గ్యాంగ్రేప్: చిత్రీకరణ
బెంగళూరు: కుమారుడి ఎదుటే అతడి తల్లి(35)పై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా తమ సెల్ఫోన్లలో ఆ అఘాయిత్యాన్ని చిత్రీకరించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడికి బాధిత మహిళతో విబేదాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యాచార ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాల వల్ల భర్తకు దూరమైన మహిళ తన 14ఏళ్ల కుమారుడితో కలిసి హెచ్ఎస్ఆర్ లేఔట్ పరిధిలోని నాయకహళ్లిలో నివాసం ఉంటోంది. కాగా, మార్చి 6న అర్ధరాత్రి స్థానిక జిల్లా పంచాయతీ సభ్యుడైన సంతోష్ రెడ్డి, అతడి అనుచరులు బాధితురాలి ఇంటికి వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆమె కుమారుడిని బంధించి అతడి కళ్లెదుటే ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు దుర్మార్గులు. అంతేగాక, ఈ దారుణాన్ని తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియోను అందరికీ చూపిస్తామని బెదిరింపులకు గురిచేశారు. దీంతో భయపడిన బాధితురాలి ఎవరికీ చెప్పలేదు.
చివరకు స్నేహితులు అండగా నిలవడంతో పోలీసులను ఆశ్రయించి నిందితులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు సంతోష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
కాగా, సదరు మహిళ తమ బంధువుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, దీని వల్లే వారి కుటుంబంలో కలహాలు చోటు చేసుకున్నాయని నిందితుడు సంతోష్ తెలిపాడు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు మాత్రమే ఆమె ఇంటికి వెళ్లామని చెబుతున్నాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.