చలి పంజాకు 12 మంది బలి..!
వాషింగ్టన్ : అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిపోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అతి తక్కువ టెంపరేచర్లు నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు.. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. వీపరీతమైన చలి తట్టుకోలేక 12 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా డెట్రాయిట్ తో పాటు చాలా ప్రాంతాల్లో కాలువలు, జలపాతాలు గడ్డ కట్టుకుపోయాయి.

చలి బాధ తాళలేక విలవిల్లాడిపోతున్నారు అక్కడి ప్రజలు. మరో 24 గంటలు వాతావరణ పరిస్థితి అలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. మైనస్ 30 నుంచి మైనస్ 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కంటిన్యూ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. కెనడాలో కూడా మైనస్ 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. నిరాశ్రయుల కోసం చాలాచోట్ల వందల సంఖ్యలో వార్మింగ్ కేంద్రాలు (చలి నుంచి కాపాడుకోవడానికి వెచ్చదనం లభించేలా ఏర్పాట్లు) తెరిచారు. జనజీవనం స్థంభించడమే గాకుండా రైళ్లు, విమానాల రాకపోకలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పాఠశాలలు మూతపడ్డాయి.












Click it and Unblock the Notifications