భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం: సాయం పంపుతామన్న స్కాట్ మోరిసన్
సిడ్నీ: భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు మనదేశానికి విమానాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. భారత్ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్ విమానాలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మంగళవారం వెల్లడించారు. భారత్ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్ విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధించేందుకు నిర్ణయించామని చెప్పారు. మే 15 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. కరోనావైరస్ వ్యాప్తి ప్రభావం భారత్లో తీవ్రంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోరిసన్ తెలిపారు.
అంతేగాక, భారత్కు కరోనా కట్టడి విషయంలో తమ దేశం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని మోరిసన్ తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను భారత్కు పంపిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్రత భారత్లో ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్లో కరోనా రోగులు పడుతున్న ఇబ్బందులను చూస్తుంటే గుండె బద్దలవుతోందని మోరిసన్ వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటికే కెనడా, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్ దేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
కాగా, గత 24 గంటల్లో భారతదేశంలో రోజువారీ కరోనావైరస్ వ్యాప్తిలో స్వల్ప క్షీణత కనిపించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,23,144 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 1,76,36,307 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటలలో 2,771 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా సంబంధిత మరణాల సంఖ్య 1,97,894 కు చేరుకుంది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 28,82,204కు చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 16.25 శాతానికి పెరిగింది.