భారత్ పక్కలో బల్లెంలా డ్రాగన్.. ఖండాంతర క్షిపణి రెడీ
China: చైనా.. క్రమంగా మరో ఉత్తర కొరియాలా తయారు కాబోతోందా?.. మున్ముందు భారత్కు పక్కలో బల్లెంలా మారబోతోందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తోన్నాయి. సరిహద్దులను దాటుకుని తరచూ భారత భూభాగంలోకి దూసుకొస్తే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి కారణమౌతూ వస్తోన్న ఈ డ్రాగన్ కంట్రీ మరో కీలక అడుగు వేసింది.
ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ను విజయవంతంగా పరీక్షించింది. లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు ఇవి. పసిఫిక్ మహా సముద్రం గగనతలం మీదుగా సంధించిన ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పసిఫిక్ మహా సముద్రం మీదుగా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్ చేపట్టడం ఇదే తొలిసారిగా పేర్కొంది.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ క్షిపణి పరీక్షలు కొనసాగాయి. డమ్మీ వార్ హెడ్ గల మిస్సైల్ను ఆ దేశ కాలమానం ప్రకారం ఉదయం 8:44 నిమిషాలకు ప్రయోగించింది. ప్రయోగించిన కొద్దిసేపటికే పసిఫిక్ మహా సముద్ర జలాల్లో తాము నిర్దేశించిన ప్రదేశాన్ని తాకినట్లు పీఎల్ఏ వెల్లడించింది.
ఈ పరీక్షలు తమ సైనిక రోజువారీ చర్యల్లో భాగమేనని, రాకెట్ ఫోర్స్ను మరింత బలోపేతం చేసుకోవడం కోసమేనని పీఎల్ఏ వివరించింది. ఏ దేశాన్ని కూడా లక్ష్యంగా చేసుకోవాలని వైమానిక దాడులకు పాల్పడాలనే ఉద్దేశంతో కాదని పేర్కొంది. ఈ పరీక్షలను నిర్వహించబోతోన్నట్లు ముందుగానే సంబంధిత దేశాలకు తెలియజేశామని తెలిపింది.
కాగా- చైనా నుంచి ముందుగానే తమకు మిస్సైల్ పరీక్షల సమాచారం అందినట్లు జపాన్ కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు. దీనికి అనుగుణంగా నేవిగేషన్ వార్నింగ్ను జారీ చేసినట్లు చెప్పారు. ఈ మిస్సైల్ శకలాలు దక్షిణ చైనా సముద్ర జలాలతో పాటు ఫిలిప్పీన్స్ పరిధిలోని లుజాన్ ఐలాండ్స్, సౌత్ పసిఫిక్ రీజియన్లల్లో కనిపించాయి.
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించడం వెనుక చైనా ఉద్దేశం వేరుగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. మున్ముందు అణ్వస్త్రాలను సైతం మోసుకెళ్లేలా తన పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ను బలోపేతం చేసుకోవడానికే దీన్ని నిర్వహించినట్లు చెబుతున్నారు. న్యూక్లియర్ వార్ హెడ్స్ను సైతం సిద్ధం చేసుకొని ఉండొచ్చనీ అంటున్నారు.












Click it and Unblock the Notifications