సౌదీలో భారత కార్మికుడి తల నరికివేత
రియాద్: హత్య కేసులో అరెస్టయిన భారతీయ కార్మిడికి సౌదీ అరేబియా న్యాయస్థానం మరణ శిక్షను విధించింది. అక్కడి చట్టాల ప్రకారం అతడి తల నరికి వేసి శిక్షను అమలు చేశారు. తనకు ఉపాధి కల్పించిన ఢాఫిర్ ఆల్-డొసరిని హత్య చేసిన కేసులో భారతదేశానికి చెందిన మహ్మద్ లతీఫ్ అనే కార్మికుడి శిరచ్ఛేదనం చేసినట్లు ఆ దేశ ఆంతరంగిక వ్యవహారాల శాఖ వెల్లడించింది.
ఢాఫిర్తో గొడవపడిన లతీఫ్, అతన్ని ఓ ఇనుప రాడ్తో కొట్టి చంపాడు. ఆ తర్వాత డాఫిర్ మృతదేహాన్ని గోతిలో పూడ్చి పెట్టాడు. కేసు విచారించిన స్థానిక న్యాయస్థానం నేరం రుజువు కావడంతో లతీఫ్కు మరణ శిక్ష విధించింది.
మృతుడి కుమారులు పెరిగి పెద్దవారయిన తర్వాత శిక్షను అమలు చేయాలని గతంలో అభ్యర్థించడంతో కోర్టు శిక్షను వాయిదా వేసింది. వాయిదా గడువు పూర్తవడంతో గురువారం శిక్షను అమలు చేసినట్లు సౌదీ మీడియా పేర్కొంది.
ఈ సంవత్సరంలో ముగ్గురు నేరస్థులకు శిరచ్ఛేదనం చేసినట్లు అక్కడి మీడియా తెలిపింది. సౌదీ అరేబియాలో హత్య, అత్యాచారం, దోపిడీ, మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడితే షరియా చట్టం ప్రకారం నేరస్థులకు కఠిన శిక్షలు అమలు చేస్తారు.