కొంచెమైతే ప్రాణాలే పోయేవి!, రైలు కింద పడ్డ బాలుడు(వీడియో)
ఈమధ్య కాలంలో తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో.. జనాలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇటీవలే ఈ వీడియోను విడుదల చేశారు.
సిడ్నీ: రైలు ప్రయాణాల్లో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఊహించని ప్రమాదాలు జరగడం ఖాయం. ముఖ్యంగా రైలు ఎక్కే సమయంలో.. దిగే సమయంలో.. పొరపాటున కాలు ప్లాట్ఫామ్ సంధులో ఇరుక్కున్నా!.. లేక రైలు వస్తున్న విషయం గమనించకుండా.. పట్టాలు దాటే ప్రయత్నం చేసినా.. జీవితాలు గల్లంతవడమే తరువాయి.
అయితే అదృష్టవశాత్తు తృటిలో మృత్యువు నుంచి బయటపడేవారు కూడా ఉంటారు. ఇలాంటి వీడియోలు ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేయడం కామన్ అయిపోయింది. తాజాగా ఇలాంటిదే ఒక వీడియో యూట్యూబ్ లోకి ఎక్కింది. రైలు ఎక్కుతున్న సమయంలో ప్లాట్ ఫామ్ సంధులో పడిపోయిన ఒక బాలుడు లక్కీగా ప్రాణాలు దక్కించుకున్నాడు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న క్రొనుల్లా రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గతేడాది చోటు చేసుకున్న ఈ ఘటనను ఈమధ్యే రైల్వే అధికారులు విడుదల చేశారు. ఇన్నాళ్లు ఆ వీడియోను బయటకు విడుదల చేయని అధికారులు.. ఇప్పుడే ఎందుకు దాన్ని బయటపెట్టరాంటే!.. ఈమధ్య కాలంలో తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో.. జనాలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇటీవలే విడుదల చేశారు.
వీడియోలో ఓ కుటుంబం ప్లాట్ ఫామ్ పై ఆగి ఉన్న రైలు ఎక్కడానికి వెళ్తుంటుంది. ఇందులో ఇద్దరు పెద్దవాళ్లు కాగా,మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అందరిలోకి చిన్నవాడైన బాలుడు రైలు ఎక్కుతున్న సమయంలో పొరపాటున ప్లాట్ ఫామ్ సంధులో పడిపోయాడు. ఇదేమి గమనించకుండానే రైలెక్కిన మిగతా కుటుంబ సభ్యులు.. ఆ తర్వాత విషయం తెలసుకుని లబోదిబోమన్నారు. రైలు కదలకుండా చూడాలని అరుపులు పెట్టారు.
ఇంతలో బాలుడి తాత చాకచక్యంగా అతన్ని ప్లాట్ ఫామ్ సంధులోంచి పైకి లాగడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలు ప్రయాణాలు చేసేటప్పుడు, చిన్నారులను తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతూ ఆస్ట్రేలియా రైల్వే అధికారులు తాజాగా ఈ వీడియో విడుదల చేశారు.